Film Nagar | ఫిల్మ్‌నగర్‌లో భారీ దొంగతనం .. 43 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు మాయం

 Authored By sandeep | The Telugu News | Updated on :7 October 2025,2:00 pm

Film Nagar | హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఫిల్మ్‌నగర్‌లో ఓ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కలకలం రేపుతోంది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగలు సుమారు 43 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదును ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

#image_title

ప‌క్కా స్కెచ్‌తో..

పోలీసుల కథనం ప్రకారం, ఈ దొంగతనం ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయూ కాలనీలో చోటుచేసుకుంది. అక్కడ నివసిస్తున్న స్వప్న అనే మహిళ గత నెల 27న తన అత్తవారింటికి వెళ్లి, వారం రోజుల అనంతరం అక్టోబర్ 5న తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన ఆమె, గదిలో వస్తువులు చిందరవందరగా పడివుండడం గమనించి షాక్‌కు గురయ్యారు. బీరువా తెరిచి ఉన్న దృశ్యం చూసి అనుమానం వచ్చిన ఆమె, బీరువాలో ఉన్న విలువైన ఆభరణాలు, నగదు చెక్ చేసినప్పుడు బంగారు నగలు 43 తులాలు మరియు లక్ష రూపాయల నగదు మాయం అయిందని తెలుసుకుంది.

వెంటనే ఆమె ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్‌తో దర్యాప్తు ప్రారంభించారు. ఇంటిని కొన్నిరోజులు మూసివేసి ఉండటం గమనించిన దొంగలు, సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేసి చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.అంతేకాకుండా, ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, షార్ట్ లిస్టు చేసిన నిందితులపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి