TG Govt : రేవంత్ సర్కార్ కు పెద్ద చిక్కు.. మార్చి 15 లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకుంటే రూ.450 కోట్ల నిధులు వెనక్కు ?
ZPTC & MPTC Elections in Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ప్రత్యేకించి పరిషత్ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధుల విషయంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. కేంద్ర నిబంధనల ప్రకారం, స్థానిక సంస్థలకు ప్రజా ప్రతినిధులు (పాలక వర్గాలు) ఉన్నప్పుడు మాత్రమే నిధులు నేరుగా ఆయా ఖాతాల్లోకి విడుదలవుతాయి. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడంతో పంచాయతీలకు నిధులు విడుదలవుతున్నప్పటికీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు (పరిషత్ ఎన్నికలు) నిర్వహించకపోవడం ఇప్పుడు శాపంగా మారింది. మార్చి 15లోపు ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించకుంటే, పరిషత్ సంస్థలకు దక్కాల్సిన సుమారు రూ. 450 కోట్ల నిధులు వెనక్కి వెళ్లే లేదా మురిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఈ నిధులు కోల్పోవడం రాష్ట్రానికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
TG Govt : రేవంత్ సర్కార్ కు పెద్ద చిక్కు.. మార్చి 15 లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకుంటే రూ.450 కోట్ల నిధులు వెనక్కు ?
పరీక్షల షెడ్యూల్తో సర్కార్ కు తలనొప్పి
ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, విద్యాశాఖ క్యాలెండర్ ఇప్పుడు అడ్డంకిగా మారింది. ఫిబ్రవరి చివరలో టెన్త్ క్లాస్ ప్రీ-ఫైనల్స్, ఆపై మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు బోర్డు పరీక్షలు (SSC) జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల సేవలు కీలకం. ఒకవేళ మార్చి 15లోపు ఎన్నికలు ముగించాలంటే, ఫిబ్రవరి ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పరీక్షల సమయంలో ఎన్నికల సందడి ఉంటే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది.
క్యాబినెట్ భేటీపైనే అందరి కళ్లు
ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 23న (ఫిబ్రవరి 23) రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా పరిషత్ ఎన్నికల షెడ్యూల్, బీసీ రిజర్వేషన్ల ఖరారు మరియు కేంద్ర నిధులను కాపాడుకునే మార్గాలపై చర్చించనున్నారు. పరీక్షలకు ఆటంకం కలగకుండా మార్చి మొదటి వారంలోనే పోలింగ్ ముగించేలా ప్లాన్ చేయాలా? లేక కేంద్రానికి విన్నవించి గడువు పొడిగింపు కోరాలా? అనే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం తర్వాతే తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగుతుందా లేదా అనేది స్పష్టమవుతుంది.