YS Jagan | కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనలో స్వల్ప ప్రమాదం .. కాన్వాయ్లో వాహనాలు ఢీ
YS Jagan | వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించారు. ఈ నేపథ్యంలో జగన్ కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.
#image_title
ప్రమాదం ఎలా జరిగింది..
ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లోని కొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇదిలాఉంటే, జగన్ పర్యటన దారిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పడమట సెంటర్ వద్ద మహిళలు గుమ్మడి కాయతో దిష్టి తీశారు. పూలు చల్లుతూ జగన్కు ఘన స్వాగతం పలికారు. పామర్రు నియోజకవర్గంలోని గోపువానిపాలెం, ఆకునూరు సెంటర్ ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, వృద్ధులు చేరి జగన్ను అభినందించారు. కల్లుగీత కార్మికులు జగన్ను కలసి తమ సమస్యలను వివరించారు.
ఇక జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెం ప్రాంతాల్లోనే పర్యటన కొనసాగించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై నిషేధం విధించగా, మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు జారీ చేశారు.