IPL 2026 : సన్ రైజర్స్ హైదరాబాద్కు శుభవార్త .. అతని రాక పై నిరీక్షణకు తెర ..!
ప్రధానాంశాలు:
IPL 2026 : సన్ రైజర్స్ హైదరాబాద్కు శుభవార్త .. అతని రాక పై నిరీక్షణకు తెర ..!
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించే ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ ఉత్కంఠభరిత పోరుకు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలవనుంది. ప్రస్తుతం లీగ్లో పాల్గొంటున్న 10 జట్లు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ కఠిన సాధనలో నిమగ్నమయ్యాయి.
Good news for Sunrisers Hyderabad
IPL 2026 : సన్రైజర్స్కు ఊరటనిచ్చిన కమిన్స్ రాక
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కీలకమైన శుభవార్త అందింది. జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్లకు దూరమవుతాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా అతను పూర్తిగా కోలుకొని జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. నేడు బెంగళూరుకు చేరుకొని సహచరులతో కలవనున్నాడు. కమిన్స్ తొలి మ్యాచ్లో ఆడతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అతను ఆడకపోతే ముందుగా నిర్ణయించినట్లుగా ఇషాన్ కిషన్ ఆ మ్యాచ్కు కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. వెన్నునొప్పి నుంచి కోలుకున్న కమిన్స్ రాకతో జట్టులో ఉత్సాహం పెరిగింది. ఇప్పటికే కొత్త ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ గాయంతో టోర్నీకి దూరమవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు కమిన్స్ చేరికతో ఆ ఒత్తిడి కొంత తగ్గినట్లు కనిపిస్తోంది.
IPL 2026 : కెప్టెన్ల సమావేశానికి ఇషాన్ కిషన్ హాజరు
ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగే కెప్టెన్ల సమావేశం బుధవారం బెంగళూరులో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సన్రైజర్స్ తరఫున ఇషాన్ కిషన్ హాజరుకానున్నాడు. కమిన్స్ బెంగళూరుకు చేరుకున్నప్పటికీ ఈ సమావేశంలో జట్టును ప్రాతినిధ్యం వహించే బాధ్యతను ఇషాన్కే అప్పగించారు. ఈ సమావేశంలో టోర్నీ నిబంధనలు, ఫెయిర్ ప్లే, కొత్త మార్పులు వంటి అంశాలపై చర్చించనున్నారు. అన్ని జట్ల కెప్టెన్లు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. ఈ సమావేశం తర్వాత టోర్నీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
IPL 2026 : మిచెల్ స్టార్క్పై కొనసాగుతున్న అనిశ్చితి
ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అందుబాటుపై ఇంకా సందిగ్ధత నెలకొంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో అతన్ని రూ. 11.75 కోట్లకు ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు అతను జట్టుతో కలవలేదు. స్టార్క్ వర్క్లోడ్ను క్రికెట్ ఆస్ట్రేలియా సమీక్షిస్తోందని సమాచారం. అతనికి అవసరమైన ఎన్ఓసీ (NOC) ఇంకా లభించలేదని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ వెల్లడించాడు. ఎన్ఓసీ వచ్చిన తర్వాతే స్టార్క్ జట్టుతో ఎప్పుడు చేరతాడన్నది ఖరారవుతుందని తెలిపాడు. జట్టు డైరెక్టర్ వేణుగోపాల్ రావు మాత్రం స్టార్క్ రాకపై ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనుమతి వచ్చిన వెంటనే అతను జట్టుతో చేరతాడని నమ్మకం వ్యక్తం చేశాడు. దీంతో ఢిల్లీ అభిమానులు స్టార్క్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు జట్లలో జరుగుతున్న మార్పులు, గాయాలు, ఆటగాళ్ల అందుబాటు వంటి అంశాలు టోర్నీపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈసారి కూడా ఐపీఎల్ అభిమానులకు ఉత్కంఠభరిత మ్యాచ్ల విందు అందించనుంది.