Rithu Bharosa : రైతు భరోసా అమలు పై ప్రభుత్వం కీలక నిర్ణయం .. వారికి మాత్రమే పెట్టుబడి సాయం ..!
ప్రధానాంశాలు:
Rithu Bharosa : రైతు భరోసా అమలు పై ప్రభుత్వం కీలక నిర్ణయం .. వారికి మాత్రమే పెట్టుబడి సాయం ..!
Rithu Bharosa : యాసంగి సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం నిరాటంకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రైతు భరోసా పథకం అమలులో పూర్తిగా “భూభారతి” పోర్టల్ను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అర్హులైన ప్రతి రైతుకు సహాయం అందేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గతంలో సాంకేతిక కారణాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఈసారి అవకాశం కల్పించనుంది.
Rithu Bharosa : రైతు భరోసా అమలు పై ప్రభుత్వం కీలక నిర్ణయం .. వారికి మాత్రమే పెట్టుబడి సాయం ..!
Rithu Bharosa : భూభారతి ఆధారంగా పారదర్శక అమలు
ప్రభుత్వం భూభారతి పోర్టల్ను పకడ్బందీగా రూపొందించడంతో, అందులో నమోదైన భూమి వివరాలను ఆధారంగా చేసుకుని రైతు భరోసా అమలు చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు పోర్టల్లో నమోదైన పట్టాదారులతో పాటు, అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన వారికి కూడా పథకం వర్తింపజేస్తుంది. కొత్తగా పట్టాదార్ పాస్పుస్తకాలు పొందిన రైతులు, గతంలో పథకం పొందలేకపోయిన వారు తమ దరఖాస్తులను సమర్పించాలని వ్యవసాయశాఖ సూచించింది. యాసంగి సీజన్ ముగింపు దశలో ఉన్నప్పటికీ, రైతు భరోసా ఆలస్యంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఈ నెల 22 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం సాయం మూడు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా రైతులకు ఆర్థికంగా ఊరట కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
Rithu Bharosa : లక్షలాది రైతులకు ఉపశమనం
ఉమ్మడి జిల్లాలో సుమారు 1,05,984 మంది రైతులు గతంలో వివిధ సాంకేతిక కారణాలతో రైతు భరోసా పొందలేకపోయారు. ఈసారి వారికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసే అవకాశం కల్పించారు. జిల్లాల వారీగా చూస్తే, నల్లగొండలో 51,398 మంది, సూర్యాపేటలో 18,049 మంది, యాదాద్రిలో 36,537 మంది రైతులు లబ్ధి పొందలేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. బ్యాంకు ఖాతాల వివరాలు, మొబైల్ నంబర్ల సవరణ, ఇతర లోపాలను ఈ నెల 25లోపు సరిచేయనున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈవోలు, ఎంఏవోలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. డీబీటీ విఫలమైన కేసులకు ప్రాధాన్యం ఇస్తూ ఈసారి అందరికీ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
Rithu Bharosa : భారీగా నిధుల కేటాయింపు, విడతల వారీగా చెల్లింపు
ఉమ్మడి జిల్లాలో మొత్తం 10.69 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా గుర్తించబడ్డారు. ఇందులో ఎక్కువ మంది ఖాతాలు ఇప్పటికే అప్డేట్ చేయబడగా, మిగిలిన ఖాతాలను త్వరితగతిన సవరించనున్నారు. కొత్తగా భూములు కొనుగోలు చేసి భూభారతిలో నమోదు చేసిన రైతులను కూడా ఈ పథకంలో చేర్చుతున్నారు. జిల్లాల వారీగా ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. నల్లగొండ జిల్లాకు రూ.744.64 కోట్లకు పైగా, యాదాద్రికి సుమారు రూ.328.36 కోట్లు, సూర్యాపేటకు రూ.376.39 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడతగా ఎకరం వరకు రూ.6,000 చొప్పున చెల్లించి, తరువాత భూమి పరిమాణాన్ని బట్టి మిగిలిన మొత్తాన్ని అందించనున్నట్లు సమాచారం. పాస్పుస్తకాలు లేకపోతే డిజిటల్ పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చర్యలు చేపట్టామని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రైతుల్లో ఆశాభావం నెలకొంది.