Hyderabad : జోన్-3 సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల ప‌రిశీలించిన‌ ఎండీ అశోక్ రెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyderabad : జోన్-3  సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల ప‌రిశీలించిన‌ ఎండీ అశోక్ రెడ్డి..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 February 2025,1:00 am

ప్రధానాంశాలు:

  •  Hyderabad : జోన్-3  సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల ప‌రిశీలించిన‌ ఎండీ అశోక్ రెడ్డి..!

Hyderabad  : కోర్ సిటీలో మురుగు నీటి వ్యవస్థ ఆధునీకరణ కోసం చేపట్టిన జోన్-3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల్ని ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహిద్దీన్ తో కలిసి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న పనుల్ని పరిశీలించారు. మొదటగా టోలిచౌకి ఫ్లై ఓవర్ ప్రధాన రహదారిలో చేపట్టే జంక్షన్ పనులను ఆటంకాలు కాకుండా ఎలా చేపట్టాలో చర్చించారు. ఇక్కడ ప్రధాన రహదారి వివిధ మతాల ఆలయాలు, లేబర్ అడ్డా కావడంతో పనులు చేపట్టడం అంత సులువు కాదని అంచనా వేశారు. దాదాపు 8 నుంచి 11 మీటర్లు లోతులో జరిగే టన్నెలింగ్ పనులను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రద్దీ లేని సమయాల్లో, సెలవు రోజుల్లో నిర్వహించాలని తెలిపారు. టన్నెలింగ్ పనులు చేపట్టేటప్పుడు GHMC జీహెచ్ఎంసీ, ట్రాన్స్ కో, జలమండలి ట్రాన్స్ మిషన్, ఓ అండ్ ఎం అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిర్వహించాలన్నారు. అలాగే అక్కడక్కడ ట్రయల్ పిట్ ఏర్పాటు చేసుకుని భూగర్భంలో ఉన్న ఏమైనా పైపు లైన్లు, కేబుళ్లు తదితరాలను అంచనా వేసుకుని వాటికి ఆటంకం కాకుండా పనులు నిర్వహించాలని సూచించారు.

Hyderabad జోన్ 3 సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల ప‌రిశీలించిన‌ ఎండీ అశోక్ రెడ్డి

Hyderabad : జోన్-3  సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల ప‌రిశీలించిన‌ ఎండీ అశోక్ రెడ్డి..!

పనులు చేపట్టే సమయంలో సరైన బారికేడ్లు, రక్షణ పరికరాలను ధరించి భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. అక్కడి నుంచి సమీపంలోని 7 టూంబ్స్ వెళ్లే రహదారిలో అండర్ గ్రౌండ్ టన్నెలింగ్ పనులను ఎండీ పరిశీలించారు. మార్చి మొదటి వారం వరకు ఈ స్ట్రెచ్ పూర్తయ్యేలా రెండు షిఫ్టుల్లో పనులు చేపట్టి వేగంగా చేయాలని ఆదేశించారు. అనంతరం ఎండీ లైన్స్, గుడిమల్కాపూర్, గిరకపల్లి తదితర ప్రాంతాల్లో పురోగతిలో ఉన్న పైపులైన్ విస్తరణ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే.. రంజాన్ మాసంలో ముస్లింలకు ఇబ్బంది కలగకుండా.. పనులు చేపట్టి మే వరకు పూర్తి చేయాలని ఎండీ అశోక్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సీజీఎం రాజేందర్, జీఎం కుమార్, ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Hyderabad  జోన్-3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు

మూసీనదికి ఉత్తరం వైపున కోర్ సిటీలో సీవరేజి వ్యవస్థ ఆధునికీకరణ కోసం జోన్ – 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. 4 నియోజకవర్గాల పరిధిలో 33.50 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణానికి సంబంధించి రూ.297 కోట్ల వ్యయంతో జోన్ – 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టులో మొత్తం 135 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ నిర్మాణాన్ని జలమండలి చేపడుతోంది. నగరంలోని ఓల్డ్ సిటీలో ఉన్న గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజి వ్యవస్థను ఆధునికీకరించడానికి ఈ ప్రాజెక్టు చేపట్టింది.

Hyderabad  ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు

టోలిచౌకి, గోల్కొండ, లంగర్హౌజ్, సెవెన్ టూంబ్స్, జూబ్లీహిల్స్(కొంత భాగం), మెహదీపట్నం, నానల్నగర్, ఆసిఫ్ నగర్, విజయ్నగర్ కాలనీ, ఎన్ఎండీసీ కాలనీ, మాసబ్ ట్యాంక్, రెడ్ హిల్స్, లక్డీకపూల్, బజార్ఘాట్, నాంపల్లి, మల్లేపల్లి, బేగంబజార్, తదితర ప్రాంతాలు.

ప్రాజెక్టు పురోగతి : మొత్తం పైపులైన్ పొడవు 135 కిలో మీటర్లు కాగా.. ఇప్పటి వరకు 120 కిలో మీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. ఇందులో 9.5 కిలో మీటర్ల మేర 200-300 డయా పైపు లైన్ పనులు, 6.5 ట్రంక్ మెయిన్లు నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. 10 ప్రాంతాల్లో 1.2 కిలో మీటర్లు టన్నెలింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి.

ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు

-సీవరేజ్ వ్యవస్థ పరిధి పెరుగుతుంది.
-ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల నుంచి 100 శాతం మురుగునీటి సేకరణ జరుగుతుంది.
-ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతంలో నాలాల్లోకి, మూసీ నదిలోకి నేరుగా మురుగునీటి ప్రవాహం ఉండదు.
-ఈ ప్రాంతంలో మెరుగైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది