Markapuram : మార్కాపురం బస్సు ప్రమాదం .. వెలుగులోకి విస్తుపోయే విషయాలు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Markapuram : మార్కాపురం బస్సు ప్రమాదం .. వెలుగులోకి విస్తుపోయే విషయాలు ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :26 March 2026,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Markapuram : మార్కాపురం బస్సు ప్రమాదం .. వెలుగులోకి విస్తుపోయే విషయాలు ..!

Markapuram : తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం అందరినీ కలచివేసింది. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రయాణికుల బస్సు ఒక టిప్పర్‌ను ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనం కాగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు అక్కడి దృశ్యాలు ఎంతో భీతిగొల్పేలా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు పరిస్థితి సరిగా లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు.

Markapuram bus accident Shocking facts

Markapuram bus accident.. Shocking facts

ప్రమాదానికి గంట ముందు నుంచే బస్సు ట్రబుల్ ఇచ్చిందని దాంతో దాదాపు గంటపాటు నిలిపివేసి రిపేర్లు చేసిన తర్వాత ప్రయాణం ప్రారంభించారని తెలిపారు. అయితే కొద్ది సేపటికే ఈ ఘోరం చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆ ఒక గంట ప్రయాణం కూడా సురక్షితంగా సాగి ఉంటే తమ వారు బ్రతికేవారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక బస్సు ఫిట్‌నెస్‌పై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు నెలల క్రితం సంక్రాంతి సందర్భంగా ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బస్సు కండీషన్ బాగోలేదని గుర్తించి రూ.36 వేల జరిమానా విధించినట్లు సమాచారం. అయినప్పటికీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇచ్చిన యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారి తీసిందని బాధితులు మండిపడుతున్నారు.

ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. గత ఏడాది అక్టోబర్‌లో కర్నూల్ జిల్లా లో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఇంకా ప్రజల మదిలో తాజాగానే ఉంది. ఆ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. సీటింగ్ బస్సుకు అనుమతి తీసుకుని అక్రమంగా స్లీపర్‌గా మార్చడం వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులు బయటపడలేకపోయారు. ఇప్పుడు మార్కాపురం ఘటనలోనూ అదే తరహా నిర్లక్ష్యం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల పర్యవేక్షణ వంటి అంశాల్లో సరైన నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే స్పందించకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టినప్పుడే ఇటువంటి విషాదాలకు చెక్ పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది