Telangana Congress : 55 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయనున్నారంటే?
Telangana Congress : ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 55 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉండటంతో ముందుగా ఎలాంటి సమస్యలు లేని అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. 55 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దానికి సంబంధించిన జాబితాను మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే రెండో జాబితాను కూడా కాంగ్రెస్ విడుదల చేయనుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
మొత్తం తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తాజాగా 55 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా 64 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చెన్నూరు, కొత్తగూడెం నియోజకవర్గాలకు సీపీఐ పార్టీకి కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. సీపీఎంకు ఎన్ని సీట్లు కేటాయిస్తున్నదో తెలియాల్సి ఉంది. మొత్తానికి వామపక్ష పార్టీలకు కాంగ్రెస్ కేటాయించే సీట్లు 5 మాత్రమే.
ఇక.. తొలి జాబితాలో 58 మందిని ప్రకటిస్తామని కాంగ్రెస్ చెప్పినప్పటికీ.. తొలి జాబితాలో 55 మంది పేర్లను మాత్రమే ప్రకటించింది. మరో రెండు రోజుల్లో మిగితా నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు అభ్యర్థుల ప్రకటన ముగియగానే.. కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్రకు ప్లాన్ చేస్తోంది. బస్సు యాత్ర ద్వారానే ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
