Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

 Authored By sudheer | The Telugu News | Updated on :9 September 2025,4:58 pm

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది యువకులు రాజధాని ఖాట్మాండూలో భారీ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో 19 మందికి పైగా మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసానికి, మంత్రులు, మాజీ ప్రధానుల ఇళ్లకు నిప్పుపెట్టడంతో పాటు పార్లమెంట్ భవనంలోకి చొరబడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో సైన్యాన్ని రంగంలోకి దింపగా, చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు.

Nepal Crisis Deepens ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులునేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

ఈ పరిణామాలన్నింటికీ మూలకారణం నేపాల్ ప్రభుత్వం 26 యాప్‌లను, ముఖ్యంగా ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్‌ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిషేధించడం. కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన గడువులోగా నమోదు కానందువల్ల ఈ యాప్‌లను నిషేధించారు. ఈ నిర్ణయం యువతలో తీవ్ర ఆగ్రహం రేపింది. ముఖ్యంగా విద్యార్థులు, జెన్‌-జెడ్‌ తరం యువత జాతీయ జెండాలతో, జాతీయ గీతం పాడుతూ నిరసనలను ప్రారంభించి, తర్వాత నినాదాలతో తీవ్ర ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుల జీవితాలను దెబ్బతీస్తోందని నిరసనకారులు ఆరోపించారు.

ప్రస్తుతం టిక్‌టాక్ మాత్రం పనిచేస్తుండటంతో, యువత తమ అసంతృప్తిని వ్యక్తం చేసే ప్రధాన వేదికగా మారింది. రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవనం గడుపుతుంటే, సామాన్య ప్రజలు కష్టాల్లో కూరుకుపోతున్నారనే వీడియోలు టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్నాయి. ఇదే నిరసనలను మరింత వేడెక్కించింది. ఈ పరిస్థితులపై స్పందించిన కేపీ శర్మ ఓలి, సోషల్ మీడియా నిషేధం దేశ గౌరవాన్ని కాపాడేందుకేనని సమర్థించుకున్నప్పటికీ, పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కోలేక చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలు నేపాల్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తున్నాయి.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది