Ali Khamenei killed | ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతం: అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతీకార ప్రతిజ్ఞ
Ali Khamenei killed | అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ Ayatollah Ali Khamenei మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. దశాబ్దాల కాలంలో ఇరాన్ భూభాగంపై జరిగిన అత్యంత భారీ దాడి ఇదేనని అధికారులు పేర్కొన్నారు. ఖమేనీ మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సైనిక స్థావరాలు, సీనియర్ నాయకత్వమే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దాడి జరిగిన ప్రాంతంలోని శిథిలాల నుంచి ఖమేనీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అంతకుముందు ఇజ్రాయెల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 1989 నుంచి ఇరాన్కు నాయకత్వం వహిస్తూ, దేశ సైనిక, వ్యూహాత్మక నిర్ణయాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఖమేనీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్తో కలిసి పనిచేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Ali Khamenei killed | ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతం: అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతీకార ప్రతిజ్ఞ
ఇరాన్లో సంబరాలు, భయాందోళనలు
ఖమేనీ మరణవార్త విన్న తర్వాత ఇరాన్ అంతటా మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. టెహ్రాన్, కరాజ్, ఇస్ఫహాన్ తదితర ప్రాంతాల్లో కొందరు ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోగా, రాత్రిపూట జరిగిన భారీ బాంబు దాడులతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. “మేము చాలా భయపడుతున్నాము. మా పిల్లలు వణికిపోతున్నారు, ఎక్కడికి వెళ్లాలో మాకు అర్థం కావడం లేదు” అని టబ్రిజ్కు చెందిన 32 ఏళ్ల మిను అనే మహిళ తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరాన్ రాజకీయ వ్యవస్థకు సవాల్
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ మృతి చెందడం ఇరాన్ రాజకీయ వ్యవస్థను తీవ్రంగా కుదిపేసింది. మూడు దశాబ్దాలకు పైగా ఖమేనీ ఆధిపత్యం చెలాయించిన ఈ వ్యవస్థ, యుద్ధ సమయంలో అకస్మాత్తుగా సుప్రీం లీడర్ను కోల్పోవడం ఇదే తొలిసారి. రాజ్యాంగబద్ధంగా తదుపరి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత జాతీయ భద్రతా సంక్షోభంలో అది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ
“చరిత్రలో అత్యంత దుర్మార్గమైన వ్యక్తులలో ఒకరిని అంతమొందించాం” అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే, ఖమేనీ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతిజ్ఞ చేసింది. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సాయుధ దళాల చరిత్రలో అత్యంత భయంకరమైన దాడి ఏ క్షణంలోనైనా ప్రారంభం కావచ్చు” అని గార్డ్స్ టెలిగ్రామ్లో హెచ్చరించారు. ప్రాంతీయంగా ఉన్న అమెరికా స్థావరాలు, ఆక్రమిత భూభాగాలే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
తీవ్రరూపం దాల్చుతున్న పరిస్థితులు
ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా ఈ దాడుల్లో మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అలాగే, ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ, రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ మొహమ్మద్ పక్పూర్ కూడా హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ తన ప్రతీకార దాడులను ప్రారంభించింది. మధ్యప్రాచ్యంలోని Middle East పలు ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. అబుదాబి, టెల్ అవీవ్ నగరాల్లో జరిగిన పేలుళ్లలో కనీసం ఇద్దరు మరణించారు. పరిస్థితులు తీవ్రంగా మారడంతో ఇరాన్, ఇరాక్, కువైట్, సిరియా, యూఏఈ, ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని పౌర విమానాలకు మూసివేశాయి. పలు విమానయాన సంస్థలు మధ్యప్రాచ్యానికి విమానాలను రద్దు చేశాయి.
మరోవైపు, ఇరాన్ పౌరులు తమ దేశాన్ని తిరిగి తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పిలుపునిచ్చారు.