Karthika Deepam 2 March 27th 2026 Today Episode : వీలునామాపై జ్యోత్స్న రచ్చ.. కన్నకూతురిని కాదా అని డౌట్.. స్వప్న షాకింగ్ డెసిషన్!

 Authored By jagadesh | The Telugu News | Updated on :27 March 2026,9:21 am

Karthika Deepam 2 March 27th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ రోజుకో సరికొత్త మలుపుతో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆస్తి, వీలునామా, బంధాలు, అనుమానాల చుట్టూ కథ రసవత్తరంగా సాగుతోంది. ఈరోజు (మార్చి 27) ఎపిసోడ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీలునామా మార్చాలని పట్టుబట్టిన జ్యోత్స్నకు తండ్రి దశరథ, తల్లి సుమిత్ర నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలు తాను వాళ్లకు పుట్టిన సొంత కూతురినేనా? లేదా దీప వాళ్ల కన్నకూతురా? అనే తీవ్రమైన అనుమానం జ్యోత్స్నలో మొదలైంది. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ప్రధానంగా జరిగిన హైలైట్స్ ఏంటో వివరంగా చూద్దాం.

Karthika Deepam 2 March 27th 2026 Today Episode : వీలునామాపై జ్యోత్స్న రచ్చ.. కన్నకూతురిని కాదా అని డౌట్.. స్వప్న షాకింగ్ డెసిషన్!

Karthika Deepam 2 March 27th 2026 Today Episode : వీలునామాపై జ్యోత్స్న రచ్చ.. కన్నకూతురిని కాదా అని డౌట్.. స్వప్న షాకింగ్ డెసిషన్!

Karthika Deepam 2 March 27th 2026 Today Episode వీలునామా మార్చే ప్రసక్తే లేదు.. దశరథ వార్నింగ్

ఎపిసోడ్ ప్రారంభంలోనే ఇంట్లో వీలునామా పంచాయతీ తారాస్థాయికి చేరుకుంటుంది. “లాయర్ గారు ఇక్కడే ఉండాలి.. వీలునామా ఇప్పుడే మార్చి రాయాలి, దాంట్లో ఉన్న తప్పుల్ని సరిచేయాలి” అని జ్యోత్స్న పట్టుబడుతుంది. దీనికి దశరథ తీవ్రంగా స్పందిస్తాడు. “దానిలో ఒక్క అక్షరం కూడా మార్చను. ఒకవేళ నువ్వు నా కూతురివి కాదని చెప్పు.. అప్పుడు ఇప్పుడే వీలునామా మారుస్తాను” అని అందరికీ షాక్ ఇస్తాడు. జ్యోత్స్న మాత్రం తగ్గకుండా.. “మేనల్లుడి కుటుంబానికి ఆస్తి చెందాలని ఎలా రాస్తావు? రాస్తే మాత్రం వాళ్లు ఎలా తీసుకుంటారు?” అని నిలదీస్తుంది. అప్పుడే ఎంటర్ అయిన పారిజాతం.. “తేరగా ఆస్తి వస్తుంటే వాళ్లెందుకు వద్దు అంటారు?” అంటూ తన వక్రబుద్ధిని బయటపెడుతుంది.

Karthika Deepam 2 March 27th 2026 Today Episode శ్రీధర్ ఫైర్.. కార్తీక్ క్లారిటీ

పారిజాతం మాటలకు కార్తీక్ తండ్రి శ్రీధర్ రగిలిపోతాడు. “నా భార్య కానీ, నా కొడుకు కానీ ఆస్తుల మీద ఆశపడే వాళ్లే అయితే.. ఈ పంచాయతీ ఏనాడో కోర్టులో జరిగేది. కాగితాలు తీసుకెళ్లి మరీ బతిమలాడాను.. ఒక్క సంతకం పెడితే మా తాత మీద కేసు వేస్తానని అడిగాను. కానీ అందుకు నా భార్య, కొడుకు ఒప్పుకోలేదు. దీప కూడా నా భర్త ఇష్టమే నా ఇష్టమని చెప్పింది” అని శ్రీధర్ గట్టి కౌంటర్ ఇస్తాడు. శివన్నారాయణ కూడా దశరథ వైపే నిలబడతాడు. “నేను రాసిన వీలునామాను నువ్వు మార్చి రాశావంటే నీకు నా మీద ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతోంది” అని దశరథపై కోప్పడినట్లు నటించినా లోలోపల సపోర్ట్ చేస్తాడు. మరోవైపు జ్యోత్స్న.. “ఈ అగ్రిమెంట్ డాడీ వెనక ఉండి బావ ఆడిస్తున్న నాటకం. నేను ఈ క్షణమే అగ్రిమెంట్‌ని క్యాన్సిల్ చేస్తున్నాను” అని సంచలన నిర్ణయం తీసుకుంటుంది. దీనికి కార్తీక్ స్పందిస్తూ.. “అగ్రిమెంట్ అనేది నీకు, నాకు మధ్య జరిగింది. వీలునామా నీకు, మామయ్యకు మధ్య జరిగింది. దయచేసి నన్ను దీనిలోకి లాగొద్దు. మాకు ఆస్తులు అక్కర్లేదు, ఆ క్లాజ్ తీసేయండి మామయ్య” అని తేల్చి చెబుతాడు.

సుమిత్ర ఎంట్రీ.. జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాక్

తనకు మద్దతుగా కనీసం తల్లి సుమిత్ర అయినా నిలబడుతుందని జ్యోత్స్న ఆశపడుతుంది. కానీ సుమిత్ర ఎంట్రీ ఇచ్చి.. “ఇది అన్యాయం కాదని, వీలునామా మార్చడం గురించి తనకు ముందే తెలుసని, తన భర్త తనకు చెప్పే చేశారని” కుండబద్దలు కొడుతుంది. “పెళ్లి చేసుకోమంటే ఇప్పట్లో చేసుకోను అన్నావు.. నీ మీద మాకు కొన్ని కలలు ఉండవా? జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? నా కూతురు పెళ్లి చేసుకుంటుంది, పిల్లల్ని కంటుంది.. నా కూతురి పిల్లలకు ఈ ఆస్తి దక్కుతుందని ఆ క్లాజ్ పెట్టాం. అందులో తప్పేముంది?” అని సుమిత్ర లాజిక్‌గా అడుగుతుంది. దీంతో జ్యోత్స్న నోట మాట రాదు.

దీపపై పారిజాతం కుట్రలు.. కాంచన వార్నింగ్

ఆస్తి మేనల్లుడి కుటుంబానికి దక్కడం అనే పాయింట్ కార్తీక్ వల్లే వచ్చిందని, దానికి కారణం దీప అని పారిజాతం మళ్లీ విషం చిమ్ముతుంది. “నువ్వు పనిమనిషిగా వచ్చి కార్తీక్ గాడిని పెళ్లి చేసుకున్నావు. అప్పుడప్పుడు దశరథని నాన్న అని పిలుస్తూ ఆ పదాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తి కొట్టేయాలని చూస్తున్నావు” అని దీపను అవమానిస్తుంది. దీంతో కార్తీక్, కాంచన తీవ్రంగా మండిపడతారు. దశరథ కలుగజేసుకుని దీప గురించి నిజం చెప్పబోతుండగా కార్తీక్ అతన్ని ఆపుతాడు. “మీరు ఎన్ని చెప్పినా మాకు మీ ఆస్తులు అక్కర్లేదు. జ్యోత్స్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో తన ఇష్టం” అని కార్తీక్ చెబుతాడు. అక్కడి నుంచి వెళ్తూ కాంచన.. “వీలునామా రాసింది మీ నాన్న.. ఇకపై నా కొడుకుని కానీ, కోడల్ని కానీ ఒక్క మాట అన్నా ఊరుకోను” అని పారిజాతానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.

కాశీకి స్వప్న షాక్.. వేరే పెళ్లికి ఓకే

మరోవైపు కథలో ఇంకో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. స్వప్న కోసం దాస్ పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు. వసంత్ అనే అబ్బాయిని తీసుకొస్తాడు. వసంత్‌కు స్వప్న బాగా నచ్చుతుంది. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న కాశీ రగిలిపోతాడు. “నేను డివోర్స్ పేపర్ల మీద సంతకాలు పెట్టినా.. నా భార్య నాకు కావాలని కోరుకుంటున్నాను. నువ్వు ఇంకొకరికి దగ్గరైతే మనం ఎప్పటికీ కలవలేం.. పెళ్లి ఇష్టం లేదని చెప్పు” అని కాశీ బతిమాలుతాడు. కానీ స్వప్న మాత్రం అందరికీ షాకిస్తూ.. “నాకు ఈ పెళ్లి ఇష్టమే. విడాకుల కాగితంపై ఎప్పుడైతే సంతకం పెట్టానో అప్పటి నుంచే అతను నాకు ఏం కాడు” అని కాశీ ముఖం మీదే చెప్పేస్తుంది. వసంత్ కూడా “మాకు పెళ్లి అయ్యేంతవరకు మా ఆవిడను బాగా చూసుకో” అని కాశీకి కౌంటర్ వేసి వెళ్లిపోతాడు.

కన్నకూతురిని కాదా? జ్యోత్స్నలో రేగిన అనుమానం

ఎపిసోడ్ చివర్లో జ్యోత్స్న వీలునామా గురించి తీవ్రంగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది. తన తండ్రి అన్న మాటలు (నువ్వు నా కూతురివి కాదని చెప్పు) ఆమెను తొలిచివేస్తుంటాయి. “అసలు నేను నిజంగానే సుమిత్ర, దశరథల సొంత కూతురినా? కాదా? ఒకవేళ దీపే వాళ్ల కన్నకూతురా?” అన్న బలీయమైన అనుమానం జ్యోత్స్న మనసులో నాటుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దీప.. అమ్మానాన్నలను బాధపెట్టొద్దని సలహా ఇస్తుంది. “నా కూతురి పిల్లలకు ఆస్తి రాశాను అని చిన్నయ్య గారు చెప్పినప్పుడు.. నేను నీ కూతురిని, ఆస్తి నాకు రాస్తే ఏంటి? నా పిల్లలకు రాస్తే ఏంటి? అని నువ్వు బలంగా ఎందుకు అడగలేకపోయావు?” అని దీప సూటిగా ప్రశ్నిస్తుంది. “ఒక గేమ్ స్టార్ట్ చేసినప్పుడు, తెలివైన వాడు గెలుస్తాడా? ఆట తెలిసినోడు గెలుస్తాడా?” అని జ్యోత్స్న అడగగా.. “ఆట తెలిసినోళ్లే గెలుస్తారు” అని దీప బదులిస్తుంది. “నువ్వు ఆట తెలిసిన దానివి.. నేను తెలివైన దానిని. నేను ఒకటి గెలవాలని ఆడేలోపు నువ్వు అంతా గెలుచుకుని పోతావు” అంటూ తనలో ఉన్న ఓటమి భయాన్ని జ్యోత్స్న బయటపెట్టడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో..

జ్యోత్స్న తన జన్మ రహస్యం తెలుసుకునేందుకు ఎలాంటి అడుగులు వేయబోతోంది? దీపకి సుమిత్ర, దశరథలు మరింత దగ్గరవుతారా? కార్తీక్-దీపల బంధం ఎలా బలపడనుంది? స్వప్న నిజంగానే కాశీని వదిలేసి వసంత్‌ను పెళ్లి చేసుకుంటుందా? అనేది రాబోయే ఎపిసోడ్స్‌లో ఉత్కంఠగా మారనుంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి