New Scheme for Women : డ్వాక్రా మహిళల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ డ్రోన్లను అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. సాధారణంగా 10 లక్షల రూపాయల విలువ చేసే ఈ డ్రోన్లు కేవలం 2 లక్షల రూపాయలకే అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 80 శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తోంది. రైతుల కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ అవకాశాన్ని కల్పించడం ద్వారా వ్యవసాయంలో సాంకేతికతను ప్రోత్సహించడం, మహిళలకు ఆర్థిక బలాన్ని అందించడం అనే ద్వంద్వ ప్రయోజనాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Dwcra women
ఈ పథకం కింద ఎంపికయ్యే లబ్ధిదారులకు 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. డ్రోన్ల వినియోగం, నిర్వహణ, వ్యవసాయంలో వాటి ఉపయోగం వంటి అంశాలపై మహిళలు అవగాహన పొందుతారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు డ్రోన్ మెకానిక్గా ఐదు రోజుల శిక్షణ ఇస్తారు. దీని ద్వారా చిన్న చిన్న మరమ్మతులను స్వయంగా చేసుకునేలా చేస్తారు. శ్రీనిధి లేదా వాలంటరీ సంస్థల ద్వారా రుణ సదుపాయం కూడా కల్పించనున్నారు. ఈ విధంగా మహిళలు స్వయం సమృద్ధిగా మారే అవకాశం కలుగుతుంది.
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం రైతులకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక ఎకరం పొలానికి కేవలం 5 నుంచి 7 నిమిషాల్లోనే పురుగు మందులు పిచికారీ చేయవచ్చు. దీని వలన సమయం ఆదా కావడమే కాకుండా, మందుల వృథా తగ్గిపోతుంది. రైతులు ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండగలరు. అంతేకాక డ్రోన్లను ఇతరులకు అద్దెకు ఇచ్చి అదనంగా ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇలా డ్వాక్రా మహిళలకు డ్రోన్లు అందించడం ద్వారా వారికీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి, వ్యవసాయ రంగం ఆధునికత దిశగా ముందుకు సాగుతుంది.