YS Jagan : 2029 లక్ష్యంగా జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం?
YS Jagan : 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాల పర్యటనలు, కేడర్ యాక్టివ్, కపిల్ సాహు వ్యూహాలు, ఆపరేషన్ 2029పై పూర్తి వివరాలు.
YS Jagan : 2029 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత కొద్ది వారాలుగా వైసీపీ కార్యక్రమాల్లో కనిపిస్తున్న వేగం, పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న చురుకుదనం వెనుక సమగ్ర కార్యాచరణ ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ కేడర్ నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించాలనే దిశగా వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరులోని యలహంకలో జగన్ పలువురు పార్టీ సీనియర్ నాయకులు, ఎన్నికల వ్యూహకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సమావేశాల ఫలితంగానే ఇటీవల వైసీపీ కార్యక్రమాలు మరింత దూకుడుగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
YS Jagan : 2029 లక్ష్యంగా జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం?
YS Jagan : కపిల్ సాహు ఎంట్రీ తర్వాత కేడర్లో కొత్త జోష్
పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా కపిల్ సాహు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండేళ్లుగా నిస్తేజంగా ఉన్న కేడర్లో మళ్లీ చైతన్యం తీసుకురావడానికి చర్యలు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. గతంలో జగన్ జిల్లాలకు వచ్చినప్పుడు మాత్రమే చురుకుగా కనిపించే నాయకులు, ఇప్పుడు స్వయంగా కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లోకి వెళ్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి ఉదాహరణగా అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలపై భూకబ్జా ఆరోపణలతో చేపట్టిన ఆందోళనలు, అలాగే మెగా డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలను రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. డీఎస్సీలో ఉద్యోగాలు రాలేదని భావిస్తున్న అభ్యర్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారితో చర్చించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా వైసీపీ వ్యూహంలో భాగమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మెగా డీఎస్సీ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసి ప్రభుత్వాన్ని వివరణ ఇచ్చే పరిస్థితిలోకి తీసుకురావాలనే ప్రయత్నం కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
YS Jagan : జిల్లాల పర్యటనలు, గ్రౌండ్ రిపోర్టులతో ‘ఆపరేషన్ 2029’
గతంతో పోలిస్తే జగన్ రాజకీయ శైలిలో కూడా మార్పు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. విశాఖపట్నంలో మత్స్యకారులను పరామర్శించడం, అనంతరం శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం వంటి వరుస కార్యక్రమాల ద్వారా పార్టీ కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభించాలనుకున్న పాదయాత్ర ప్రణాళికలో కూడా మార్పులు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఒకేసారి దీర్ఘకాల పాదయాత్రకు బదులుగా ప్రతి వారం కనీసం ఒక జిల్లా పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని సమాచారం. దీంతో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కపిల్ సాహు బృందంతో పాటు గతంలో వైసీపీకి సేవలు అందించిన పలువురు ఎన్నికల విశ్లేషకులు, సెఫాలజిస్టులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వారు ప్రతి నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాభిప్రాయం, పార్టీ బలాబలాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక నివేదిక ఇప్పటికే సిద్ధమైనట్లు, త్వరలో పూర్తి నివేదికను పార్టీ నాయకత్వానికి అందజేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నివేదిక ఆధారంగా వచ్చే మూడు సంవత్సరాల కార్యాచరణ, నియోజకవర్గాల వారీగా బాధ్యతల పంపిణీ, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను 2029 ఎన్నికల లక్ష్యంతో రూపొందిస్తున్న ‘ఆపరేషన్ 2029’ వ్యూహంలో భాగంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.







