Janasena MLA Arava Sridhar : వీణ తో సంబంధం గురించి కమిటీ వద్ద అన్ని విషయాలు చెప్పిన ఎమ్మెల్యే శ్రీధర్
Janasena MLA Arava Sridhar : జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మంగళవారం పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో, బాధితురాలు (వీణ) చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే తన వివరణను సమర్పించారు. తనకు, సదరు మహిళకు మధ్య జరిగిన పరిచయం నుండి తాజా పరిణామాల వరకు అన్ని అంశాలను కమిటీకి వివరించినట్లు ఆయన తెలిపారు. ఇది తన వ్యక్తిగత విషయమని, దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, రాజకీయంగా తనను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు వస్తున్నాయని ఆయన వాదించారు.
Janasena MLA Arava Sridhar : వీణ తో సంబంధం గురించి కమిటీ వద్ద అన్ని విషయాలు చెప్పిన ఎమ్మెల్యే శ్రీధర్
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీధర్, తన వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి అందజేశానని చెప్పారు. సదరు మహిళ తనను బెదిరించి భారీగా డబ్బు డిమాండ్ చేసిందని, తాను తప్పు చేయలేదని కమిటీకి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. “పార్టీ ఆదేశాల మేరకు నేను విచారణకు హాజరయ్యాను, కమిటీ నివేదిక ఆధారంగా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను” అని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని, చట్టపరమైన పోరాటానికైనా తాను సిద్ధమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, ఈ వ్యవహారంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) జోక్యంతో కీలక మలుపు తిరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు NHRC ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(2), 318(4) (మోసం), మరియు 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద ఈ FIR నమోదైంది. జనసేన కమిటీ తన నివేదికను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు అందజేయనుండగా, అటు పోలీసు విచారణ కూడా వేగవంతం కావడంతో ఈ కేసు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.