Andhra Pradesh : మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్న కూటమి సర్కార్
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న “దీపం-2” పథకంలో ముఖ్యమైన మార్పు చేపట్టింది. గతేడాది నవంబర్లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2023 నవంబర్ నుంచి 2024 మార్చి వరకు లబ్ధిదారులకు ఒక్కో ఉచిత సిలిండర్ అందించగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ నుంచి ప్రతీ సంవత్సరంలో మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కొత్త విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇంతకుముందు లబ్ధిదారులు సిలిండర్ పొందిన తర్వాత రీయింబర్స్మెంట్గా డబ్బులు తీసుకునేవారు. కానీ ఇకపై ప్రభుత్వం నాలుగు నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఉదాహరణకు ఆగస్టులో రెండవ ఉచిత సిలిండర్ అందుకునే వారు ముందుగానే తమ ఖాతాలో రూ.900 పొందవచ్చు. అదే విధంగా డిసెంబరులో మూడవ సిలిండర్కు సంబంధించిన డబ్బు ఖాతాలో చేరుతుంది.
ప్రస్తుతం 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర సుమారుగా రూ.850 నుంచి రూ.950 వరకు ఉంది. ప్రభుత్వం సగటు ధర రూ.900గా నిర్ణయించి, ప్రతి లబ్ధిదారుడికి ఆర్థిక సంవత్సరానికి మూడు సిలిండర్లకు రూ.2,700 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. ఈ విధానం వల్ల మహిళలు ముందుగానే సిలిండర్ కొనుగోలు చేసేందుకు సులభతరం అవుతుంది. సీఎం చంద్రబాబు స్వయంగా దీన్ని ప్రకటించడమే కాకుండా, దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు. ఈ మార్పుతో మహిళలకు ఆర్థిక భారం తక్కువ అవుతుండడం తో పాటు గృహ అవసరాలు మరింత సులభంగా మారనున్నాయి.