Pastor Praveen : ఎట్టకేలకు వీడిన పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీ..!
ప్రధానాంశాలు:
Pastor Praveen : ఎట్టకేలకు వీడిన పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీ..!
Pastor Praveen : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో పోలీసులు చివరికి మిస్టరీను చేధించారు. హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరిన ప్రవీణ్, రాజమండ్రి సమీపంలో రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించడంతో తొలుత ఇది సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ అనంతరం నిజమైన ఘటనాస్థితిని వెల్లడించారు.

Pastor Praveen : ఎట్టకేలకు వీడిన పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీ..!
Pastor Praveen : ప్రవీణ్ మృతికి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. ప్రవీణ్ హైదరాబాద్, కోదాడ, ఏలూరు ప్రాంతాల్లో మద్యం షాపులకు వెళ్లినట్టు సీసీటీవీల ద్వారా గుర్తించామన్నారు. దారిలో అతనికి చిన్నపాటి ప్రమాదాలు మూడుసార్లు జరిగాయని, కీసర టోల్ ప్లాజా వద్ద ఓసారి బైక్ నుంచి జారిపడ్డారని తెలిపారు. అదే సమయంలో అంబులెన్స్ సిబ్బంది వెళ్లి అతనికి సాయం చేసినట్టు వివరించారు. ట్రావెల్ మార్గంలో అతను యూపీఐ ద్వారా ఆరుసార్లు పేమెంట్లు చేసినట్టు తెలిపారు. రామవరప్పాడు వద్ద ఆటో డ్రైవర్ సూచన మేరకు పార్కులో రెండు గంటలు విశ్రాంతి తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ప్రమాదస్థలంలో బుల్లెట్ బైకు ఎవ్వరూ ఢీకొనలేదని, బైకు వేగంగా వెళ్లడంతో ఉన్న రోడ్డు పనుల కంకర రాళ్లపైకి ఎగిరి, బైక్ పక్కకు తిరగబడినట్టు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిందన్నారు. బైక్ ఫోర్త్ గేర్ లో ఉండగా ప్రమాదం జరిగినట్టు నిపుణులు పేర్కొన్నారని తెలిపారు. మద్యం సేవించిన స్థితిలో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో స్పష్టమైందని చెప్పారు. ఈ కేసుపై ఎలాంటి హత్య కోణం లేదని, ఆరోపణలన్నీ నిరాధారమని పోలీసులు స్పష్టం చేశారు.