Gold Ban In India : భారత్లో గోల్డ్ బ్యాన్ అవుతుందా..? బంగారం కొనొద్దన్న మోదీ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా కలకలం..!
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు అంటే బంగారం కొనుగోలు చేయడం చాలా కుటుంబాల్లో ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కనీసం ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని లేదా పూర్తిగా ఆపివేయాలని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సికింద్రాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో “భారత్లో గోల్డ్ బ్యాన్ రాబోతుందా?” అనే ప్రచారం వేగంగా వైరల్ అయింది. బంగారం దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించే అవకాశం ఉందని, భవిష్యత్తులో దిగుమతి సుంకాలు కూడా పెరిగే అవకాశముందని పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు బంగారంపై పూర్తి నిషేధం విధించేలా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలు స్వచ్ఛందంగా బంగారం వినియోగాన్ని తగ్గించుకోవాలని మాత్రమే ప్రభుత్వం కోరుతోందని సమాచారం.
Gold Ban In India : భారత్లో గోల్డ్ బ్యాన్ అవుతుందా..? బంగారం కొనొద్దన్న మోదీ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా కలకలం..!
Gold Ban In India విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి.. దిగుమతుల తగ్గింపే లక్ష్యం
ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇదే సమయంలో బంగారం దిగుమతులు కూడా భారీగా పెరగడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మోదీ ప్రజలకు పలు సూచనలు చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యం ఇవ్వాలని, మెట్రో మరియు రైలు ప్రయాణాలు పెంచాలని సూచించారు. అలాగే అవసరం లేని విదేశీ ఖర్చులు, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని పిలుపునిచ్చారు.
మోదీ వ్యాఖ్యల ప్రభావం స్టాక్ మార్కెట్పైనా కనిపించింది. ప్రముఖ జ్యువెలరీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. టైటాన్, కల్యాణ్ జువెలర్స్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీల షేర్లు ఒక్కరోజులోనే 6 నుంచి 9 శాతం వరకు పడిపోయాయి.
అయితే ఆర్థిక నిపుణులు మాత్రం పూర్తి స్థాయి గోల్డ్ బ్యాన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు. భారత్లో బంగారం కొనుగోలు సంప్రదాయం చాలా బలంగా ఉండటంతో నేరుగా నిషేధం అమలు చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. కానీ అవసరమైతే దిగుమతి సుంకాలు పెంచడం, డిజిటల్ గోల్డ్ను ప్రోత్సహించడం, పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోళ్లను నియంత్రించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
ఇక ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడానికే ఈ సూచనలు చేసిందని, దేశ ఆర్థిక స్థిరత్వం కోసం దిగుమతుల నియంత్రణ అవసరమని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడం చట్టరీత్యా ఎలాంటి నేరం కాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.