Stock Market Live Updates : స్టాక్ మార్కెట్లలో ‘ట్రంప్’ సునామీ: ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల లాభం – భారీగా పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ
- అమెరికా సుంకాల తగ్గింపుతో (Tariff Cut) దలాల్ స్ట్రీట్లో పండగ వాతావరణం
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. ఏకంగా 2,400 పాయింట్ల జంప్
- రికార్డు స్థాయిలో కోలుకున్న రూపాయి.. భారీగా తరలివస్తున్న విదేశీ పెట్టుబడులు
Stock Market Live Updates : భారత స్టాక్ మార్కెట్లలో మంగళవారం సరికొత్త చరిత్ర లిఖించబడింది. భారత్-అమెరికా మధ్య కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) ఇన్వెస్టర్ల దశను మార్చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై విధిస్తున్న సుంకాన్ని 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి.
Stock Market Live Updates : స్టాక్ మార్కెట్లలో ‘ట్రంప్’ సునామీ: ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల లాభం – భారీగా పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ
సెన్సెక్స్, నిఫ్టీల రికార్డు ర్యాలీ మంగళవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే బుల్ రన్ మొదలైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 2,400 పాయింట్ల భారీ లాభంతో ట్రేడ్ అవ్వగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) 750 పాయింట్లు ఎగబాకింది. ఉదయాన్నే గిఫ్ట్ నిఫ్టీ 800 పాయింట్ల ప్రీమియంతో ట్రేడ్ అవ్వడం ఈ భారీ ర్యాలీకి ముందస్తు సంకేతాలిచ్చింది. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐటీ, ఫార్మా షేర్ల దూకుడు అమెరికా టారిఫ్ కట్ నిర్ణయం ప్రధానంగా ఐటీ, ఎగుమతి ఆధారిత రంగాలకు వరంగా మారింది. అమెరికాకు ఎక్కువగా సేవలు అందించే ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ (TCS) షేర్లు 5 నుంచి 7 శాతం వరకు లాభపడ్డాయి. టెక్స్టైల్స్, ఫార్మా రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల జాతర సాగుతోంది.
Stock Market Live Updates : రూపాయి బలోపేతం – తిరిగొచ్చిన ఎఫ్ఐఐలు (FIIs)
ఒకవైపు స్టాక్ మార్కెట్ పెరుగుతుంటే, మరోవైపు కరెన్సీ మార్కెట్లోనూ రూపాయి సత్తా చాటింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.15 వద్ద ట్రేడ్ అవుతూ రికార్డు స్థాయిలో కోలుకుంది. గత కొన్ని నెలలుగా అమ్మకాలకే పరిమితమైన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs), ఈ ఒప్పందం నేపధ్యంలో మళ్లీ భారత మార్కెట్లో భారీగా కొనుగోళ్లు ప్రారంభించడం సానుకూల పరిణామం.
Stock Market Live Updates : కీలక మలుపు
గత ఏడాదంతా అధిక సుంకాల వల్ల భారత మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. అయితే, తాజా భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. రష్యా చమురును పక్కనపెట్టి భారత్ అమెరికాకు చేరువకావడం, దానికి ప్రతిఫలంగా పన్నుల భారం తగ్గడం మార్కెట్లకు “బూస్టర్ డోస్”లా పనిచేసింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.