MLC Malka Komaraiah : ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అదనపు భారం వద్దు.. ప్రభుత్వానికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కీలక డిమాండ్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MLC Malka Komaraiah : ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అదనపు భారం వద్దు.. ప్రభుత్వానికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కీలక డిమాండ్లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 June 2026,12:00 pm

ప్రధానాంశాలు:

  •  MLC Malka Komaraiah : ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అదనపు భారం వద్దు.. ప్రభుత్వానికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కీలక డిమాండ్లు..!

MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) అమలుపై ప్రభుత్వం స్పష్టమైన విధానాలు ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. EHCT అమలు నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్న సందేహాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని ఆయన కోరారు.హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మల్క కొమరయ్య, EHCT అమలు పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అదనపు ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. పూర్తి స్థాయి మార్గదర్శకాలు, విధివిధానాలు విడుదల చేసిన తర్వాత మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ (PRC)ని అమలు చేసిన తర్వాతే ఉద్యోగుల నుంచి వాటా వసూలు చేయాలని, అప్పటివరకు ప్రభుత్వం ఆ భారం భరించాలని అన్నారు.

MLC Malka Komaraiah ఉద్యోగులు ఉపాధ్యాయులపై అదనపు భారం వద్దు ప్రభుత్వానికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కీలక డిమాండ్లు

MLC Malka Komaraiah : ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అదనపు భారం వద్దు.. ప్రభుత్వానికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కీలక డిమాండ్లు..!

MLC Malka Komaraiah EHCT అమలుపై ప్రభుత్వానికి మల్క కొమరయ్య కీలక సూచనలు

రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్, కేజీబీవీలు (KGBV), ఎస్‌ఎస్‌ఏ (SSA), యూఆర్‌ఎస్ (URS), గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల సంస్థల్లో పనిచేస్తున్న శాశ్వత, తాత్కాలిక ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి కూడా హెల్త్ కార్డులు జారీ చేయాలని మల్క కొమరయ్య కోరారు. వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల వాటాను ప్రభుత్వమే భరించాలని సూచించారు.EHCT ద్వారా సమకూరే నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా పూర్తిగా ఆరోగ్య సేవలకే వినియోగిస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్ అమలులో జాప్యం కారణంగా ఉద్యోగుల్లో అనుమానాలు పెరుగుతున్నాయని, వాటిని నివృత్తి చేసే చర్యలు తీసుకోవాలని అన్నారు.అలాగే రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని, ఓపీ సేవలను కూడా హెల్త్ కార్డు పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఎంపిక చేసిన ఆసుపత్రుల జాబితాను ముందుగానే ప్రకటించాలని, అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక అంబులెన్స్, టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని కోరారు.

MLC Malka Komaraiah PRC, DAలు, OPS సహా పెండింగ్ సమస్యల పరిష్కారానికి డిమాండ్

ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరేలా అవివాహిత యువతకు డిపెండెంట్ వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని మల్క కొమరయ్య సూచించారు. కుటుంబంలో లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్నవారికి తక్కువ కాంట్రిబ్యూషన్ విధానం అమలు చేయాలని, బేసిక్ పే ఆధారంగా కాకుండా స్థిరమైన వాటా విధానాన్ని అమలు చేయాలని కోరారు.ఉద్యోగులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి, అవసరమైనప్పుడు వివరాలను సవరించుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్‌సీ కమిటీ నివేదికను ప్రకటించి, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు.

ప్రభుత్వం విడుదల చేశామని చెబుతున్న రూ.2,000 కోట్ల బిల్లుల చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.అదేవిధంగా కలెక్టర్లను జిల్లా విద్యాశాఖాధికారులుగా (DEO) నియమించే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, జనగామ జిల్లాలో ప్రస్తుతం డీఈవోగా వ్యవహరిస్తున్న కలెక్టర్ స్థానంలో ప్రత్యేక విద్యాశాఖ అధికారిని నియమించాలని మల్క కొమరయ్య డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పెంటయ్య, ఆర్గనైజేషన్ కార్యదర్శి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది