Nalgonda : గడియారం సెంటర్లో ఉగాది వేడుకలు
ప్రధానాంశాలు:
Nalgonda : గడియారం సెంటర్లో ఉగాది వేడుకలు
Nalgonda : నల్లగొండ జిల్లా గడియారం సెంటర్లో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా కమిటీ మరియు జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నన్నూరి రమణారెడ్డి, నర్రా శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమ స్థలంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రకృతిలో లభించే సహజ పానీయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. కృత్రిమ పానీయాల వినియోగం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని హెచ్చరించారు. “కృత్రిమ పానీయాలు మానేద్దాం – సహజ పానీయాలు సేవిద్దాం” అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పించడం అభినందనీయమని ఆయన అన్నారు. నల్లగొండ తొలి మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది పండుగ యొక్క సాంప్రదాయ ప్రాముఖ్యతను వివరించి, కాలానికి అనుగుణంగా శరీరానికి అవసరమైన పోషకాలను అందించే సహజ ఆహారం, పానీయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ సామాజిక బాధ్యతగా ప్రజలకు కృత్రిమ పానీయాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడుతూ యువతలో శీతల పానీయాల వినియోగం పెరగడం ఆందోళనకరమని, అందుకే ప్రతి ఉగాది సందర్భంగా షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని పంపిణీ చేస్తూ ఆరోగ్యంపై అవగాహన పెంచుతున్నామని తెలిపారు. డీఎస్పీ కూడా ఈ కార్యక్రమాన్ని సందర్శించి, వేసవికాలంలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం వంటి సహజ పానీయాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది తెలుగువారికి నూతన సంవత్సరారంభమని, పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్ ఫలితాలను తెలుసుకునే సంప్రదాయం ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, మురళయ్య, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, మధుసూదన్, జన విజ్ఞాన వేదిక బాధ్యులు చంద్రశేఖర్, పీడీ విమల, టాప్రా జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, అడ్వకేట్ శంకరయ్యతో పాటు వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.