LPG Gas : పశ్చిమాసియా యుద్ధ ప్రభావం .. గ్యాస్ సిలిండర్లపై కేంద్రం సంచలన ప్రకటన ..!
ప్రధానాంశాలు:
LPG Gas : పశ్చిమాసియా యుద్ధ ప్రభావం .. గ్యాస్ సిలిండర్లపై కేంద్రం సంచలన ప్రకటన ..!
LPG Gas : పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. బాంబుల మోతతో మాత్రమే ఆ యుద్ధం పరిమితం కాలేదు దాని ప్రభావం మన దేశంలో గ్యాస్ సిలిండర్ సరఫరా వరకు చేరినట్లు కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల కొరతపై వార్తలు వినిపించడంతో సాధారణ ప్రజల్లో ఆందోళన పెరిగింది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లు అందుబాటులో లేక ముంబైలో కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడినట్లు సమాచారం రావడం మరింత చర్చకు దారితీసింది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ధైర్యం చెప్పే ప్రకటనలు చేసింది.
LPG Gas : పశ్చిమాసియా యుద్ధ ప్రభావం .. గ్యాస్ సిలిండర్లపై కేంద్రం సంచలన ప్రకటన ..!
LPG Gas : తాత్కాలికమే గ్యాస్ కొరత .. కేంద్రం స్పష్టీకరణ
గ్యాస్ కొరత అనే పరిస్థితి శాశ్వత సమస్య కాదని, ఇది కేవలం తాత్కాలికంగా ఏర్పడిన అంతరాయం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యుద్ధ పరిస్థితుల వల్ల దిగుమతులపై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. దేశంలోని ప్రధాన రిఫైనరీలు తమ ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 10 శాతం వరకు పెంచినట్లు సమాచారం. గృహ వినియోగదారులకు అవసరమైన సిలిండర్లు నిరంతరంగా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే కొందరు కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను విక్రయించే ప్రయత్నాలు చేస్తే, వారిపై నిత్యావసర సరుకుల చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం మరోసారి భరోసా ఇచ్చింది.
LPG Gas : హోటళ్ల సమస్యలపై ప్రత్యేక కమిటీ
వాణిజ్య సిలిండర్ల కొరతతో కొన్ని నగరాల్లో హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్న నివేదికలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆయిల్ రంగానికి చెందిన ప్రముఖ ప్రభుత్వ సంస్థల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆయా నగరాల్లోని రెస్టారెంట్ అసోసియేషన్లతో నేరుగా సంప్రదింపులు జరిపి, ఎక్కడ ఎంత గ్యాస్ అవసరముందో అంచనా వేయనుంది.అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సరఫరా అందించేలా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు సిలిండర్ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచే నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి తగ్గి సమతుల్యత నెలకొంటుందని అధికారులు భావిస్తున్నారు.
LPG Gas : ప్రత్యామ్నాయ దిగుమతులపై దృష్టి
ఇంధన భద్రత కోసం భారత్ ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ మార్గాలను ఉపయోగిస్తోంది. ప్రస్తుతం దేశానికి వచ్చే ముడి చమురులో దాదాపు 70 శాతం యుద్ధ ప్రభావం లేని మార్గాల ద్వారానే దిగుమతి అవుతోంది. ఒకవేళ పశ్చిమాసియా ప్రాంతం నుంచి సరఫరాలో అంతరాయం ఏర్పడినా, ప్రత్యామ్నాయ దేశాల నుంచి గ్యాస్ మరియు ఇంధనం తెప్పించే ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నార్వే, అమెరికా వంటి దేశాల నుంచి ద్రవీభవించిన సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతి చేసుకునే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆ దేశాల నుంచి సరుకు భారత్ చేరేందుకు కొంత సమయం పట్టినా, అప్పటివరకు దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అందువల్ల గ్యాస్ సరఫరాలో పెద్ద అంతరాయం ఉండదని కేంద్ర ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొంత ఆందోళన కలిగించినప్పటికీ, దేశంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం పలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో గృహిణులు, హోటల్ యజమానులు కొంత ఊరట పొందే పరిస్థితి ఏర్పడింది.