Kendriya Vidyalaya : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల.. వెంటనే ఇలా అప్లైచేసుకోండి..!
Kendriya Vidyalaya : ఇప్పుడు అంతా ఎగ్జామ్ సీజన్ నడుస్తుంది. ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి కాగా, పదో తరగతి పరీక్షలు కూడా మరో రెండు రోజులలో పూర్తి కానున్నాయి. ఇక ఎంట్రన్స్ టెస్ట్లకి నోటిఫికేషన్ వస్తుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతి ఏటా 1 నుంచి 11 వ తరగతి ప్రవేశాల కోసం కేవీలు షెడ్యూలు విడుదల చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. తొలి ప్రొవిజినల్ లిస్ట్ను ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న రిలీజ్ చేయనున్నారు. ఈ మూడు జాబితాల ద్వారా ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక కేవీల్లో 2వ తరగతి, ఆ పైతరగతుల్లో (11వ తరగతికి తప్ప) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుంది.
రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ లకి సంబంధించి ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టు నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలుగా నిర్ణయించారు. విద్యార్థులు పూర్తి వివరాలను వెబ్సైట్లో చూడొచ్చు అని అధికారులు చెబుతున్నారు.
