Balapur | బాలాపూర్ లడ్డూ వేలం: సంప్రదాయం నుంచి సంచలనానికి! ఈసారి ఎవరికి ద‌క్కిందంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balapur | బాలాపూర్ లడ్డూ వేలం: సంప్రదాయం నుంచి సంచలనానికి! ఈసారి ఎవరికి ద‌క్కిందంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :6 September 2025,1:00 pm

Balapur | మన దేశంలో గణేశుడు పూజలలో ప్రసిద్ధి చెందిన ప్రత్యేక సంప్రదాయాల్లో బాలాపూర్ లడ్డూ వేలంకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ రివాజు 1994లో బాలాపూర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుండి సంవత్సరం తర్వాత సంవత్సరం తన ప్రాముఖ్యతను పెంచుకుంటూ వస్తోంది. మొదటి లడ్డూ వేలం కేవలం రూ. 450కి కొలను మోహన్ రెడ్డి దక్కించుకోవడం విశేషం. అప్పటినుంచి ఈ లడ్డూ‌ను పూజించి, గ్రామస్థులకు పంచి, పొలాల్లో చల్లడం ఒక శుభసంకేతంగా మారింది.

#image_title

భారీ ద‌ర‌కు..

లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడం ఈ సంప్రదాయానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది. గత సంవత్సరం నుంచి బాలాపూర్ వినాయక మండలి ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. వేలంలో పాల్గొనాలంటే, గత ఏడాది పలికిన ధరను ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ వేలం పట్ల కూడా ఉత్కంఠ ఉంది. ఉదయం 5 గంటలకు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఊరేగింపుగా స్వామివారిని గ్రామంలో తిప్పారు. ఊరేగింపు అనంతరం బొడ్రాయ్ వద్ద లడ్డూ వేలం ప్రారంభమైంది.

గత ఏడాది బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి రూ. 30.01 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఆయన లడ్డూ భాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులకు పంచడం చర్చనీయాంశమైంది. అయితే ఈసారి, మొత్తం 8 మంది కొత్తవారు వేలంలో పాల్గొన్నారు. ఈసారి లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఇది గతేడాది రికార్డును దాటి రూ. 4.99 లక్షలు అధికంగా పలికిన ధర కావడం విశేషం. ఇది బాలాపూర్ లడ్డూ వేలం చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది