Pulivendula Bypoll : పులివెందులకు ఉపఎన్నిక ఖాయం..జగన్ కు ఇదే అగ్ని పరీక్ష
By-elections are certain for Pulivendula : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హాజరు కాకపోతే, ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఒక ఎమ్మెల్యే వరుసగా 60 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు పడుతుందని ఆయన గుర్తుచేశారు. ఈ పరిస్థితి వస్తే.. పులివెందుల నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమని ఆయన స్పష్టం చేశారు.

#image_title
రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. వై.ఎస్. జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరారు. ప్రతిపక్ష హోదా కోసం ఆయన “చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారు” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. ఒక నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత జగన్పై ఉందని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్షంగా వ్యవహరించిన జగన్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి. ప్రతిపక్ష హోదా విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ప్రకటన మరింత రాజకీయ వేడిని రాజేసింది. అయితే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో సూచిస్తున్నాయి.