BRS | మణుగూరులో ఉద్రిక్తత ..బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (BRS Office) పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం చేయడమే కాకుండా దానికి నిప్పు కూడా పెట్టారు. అలాగే కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఫ్లెక్సీలు చింపేసి, ఆఫీస్పై కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు.
#image_title
రచ్చ రచ్చ..
కాంగ్రెస్ నేతల ఆరోపణల ప్రకారం, ప్రభుత్వ భూమిపై బీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీసు బందోబస్తుతో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ను ఆక్రమించి గులాబీ రంగులు వేయించారని తెలిపారు. ఈ ఆరోపణలతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం ఉదయం ఆందోళనకు దిగారు.
కార్యాలయంలో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలో పొగలు కమ్ముకున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి, మణుగూరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బలగాలు మోహరించి ఇరుపక్షాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మణుగూరులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, పోలీసులు నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం.