KTR Phone Tapping Case : హీరోయిన్లతో రంకు కట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ కేటీఆర్ ఆవేదన
KTR Phone Tapping Case : తెలంగాణ Telangana లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున జరిగిందని రాజకీయ నేతలు , సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ వరుస కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో బిఆర్ఎస్ మాజీ మంత్రులకు వరుసగా సిట్ నోటీసులు జారీ చేస్తూ విచారిస్తుంది. ఇప్పటికే హరీష్ రావు ను విచారించిన అధికారులు , నేడు కేటీఆర్ ను విచారిస్తున్నారు. త్వరలో కేసీఆర్ కు కూడా నోటీసులు అందుతాయనే ప్రచారం జరుగుతుంది. నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ను విచారణకు పిలవడం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కేటీఆర్ విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి తెలంగాణ భవన్ చేరుకుని, అక్కడి నుంచి భారీ అనుచరవర్గంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బయలుదేరి వెళ్లారు.
KTR Phone Tapping Case : రంకు కట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ కేటీఆర్
సిట్ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత పదిహేనేళ్లుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అభివృద్ధి కోసం తాము నిబద్ధతతో పనిచేశామే తప్ప, ఎన్నడూ టైమ్ పాస్ రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రైతు బంధు, కళ్యాణ లక్ష్మి వంటి మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రోజుకో కొత్త డ్రామా ఆడుతోందని విమర్శించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే తెరపైకి తెచ్చారని ఆయన మండిపడ్డారు.
Phone Tapping Case : హీరోయిన్లతో రంకు కట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ కేటీఆర్ ఆవేదన
తనపై జరుగుతున్న వ్యక్తిత్వ హననం (Character Assassination)పై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఏదో ఒక రకంగా ఇరికించాలని చూస్తున్నారని, గతంలో డ్రగ్స్ కేసులు, హీరోయిన్లతో సంబంధాలంటూ అబద్ధపు ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో తనను, తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, అయినా దేనికీ భయపడే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు. “నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను.. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు” అని పేర్కొన్న ఆయన, రెండేళ్లుగా సీరియల్ లాగా లీకులు ఇస్తూ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. విచారణలో అన్ని విషయాలు తేలుతాయని, ప్రభుత్వమే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కేటీఆర్ సవాల్ విసిరారు.
