Chandrababu : ఉన్న ఒక్క ఆశ కూడా పాయె.. కుప్పంలోనూ ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది?

 Authored By sukanya | The Telugu News | Updated on :20 September 2021,5:40 pm

Chandrababu 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభ.. నేటి ఎన్నికల ఫలితాలతో దాదాపుగా తగ్గిపోయిందంటున్నారు రాజకీయ నిపుణులు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు జెడ్పీటీసీల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు ఘోర ఓటమి చవిచూశారు. గుడిపల్లె, కుప్పం, శాంతిపురం, రామకుప్పం జడ్పీటీసీల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దాంతో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ఇలాకా కుప్పం మండలంలో 19 ఎంపీటీసీల్లో వైసీపీ 17 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలుపొందింది. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలుండగా.. అన్ని చోట్లా వైసీపీ గెలుపొందింది. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలను వైసీపీనే గెలిచింది. శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 17 చోట్ల వైసీపీ, 1 చోట టీడీపీ గెలుపొందింది.

chandrababu

chandrababu

నారావారి పల్లెలో టీడీపీ ఘోర ఓటమి.. Chandrababu

చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీలోనూ టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది. వైసీపీ అభ్యర్థి రాజయ్య వెయ్యి ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. నాలుగు మండలాల్లోని 89 పంచాయతీల్లో 75 చోట్ల వైసీపీ, 14 చోట్ల టీడీపీ గెలుపొందాయి. మొత్తం కుప్పం నియోజకవర్గంలో 85 శాతానికి పైగా పంచాయతీల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరి దత్తత తీసుకున్న కృష్ణాజిల్లా నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని సైతం వైసీపీ గెలుపొందింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంతో పాటు ఆయన స్వగ్రామమైన నారావారిపల్లిలోనూ టీడీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 66 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 65 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.

గత ఎన్నికల నుంచే బీటలు షురూ Chandrababu

tdp senior leader jyothula nehru resigned

tdp senior leader jyothula nehru resigned

2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత.. చంద్రబాబు కుప్పం కోటకు బీటలు వారడం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తొలి రెండు రౌండ్లల్లో చంద్రబాబు వెనుకంజలో ఉండటం అప్పట్లో సంచలనంగా మారింది. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి తొలి రెండు రౌండ్లలో భారీ ఆధిక్యాన్ని కనపరిచారు. దీనితో హోరాహోరీ పోరు తప్పదనే అభిప్రాయం విశ్లేషకుల్లో కనిపించింది. ఆ తరువాత చంద్రబాబు ఆధిక్యతలోకి దూసుకెళ్లారు. 30 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజానికి చంద్రబాబు నాయుడు 30 వేల ఓట్ల తేడాతో గెలుపొందడాన్ని ఆయన నైతిక ఓటమిగా భావించే వారి సంఖ్య కూడా లేకపోలేదు. ఎందుకంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన చాలామంది కొత్త ఎమ్మెల్యేలు సైతం 40 వేలకుపైగా మెజార్టీతో చంద్రబాబు కంటే భారీ మెజారిటిని సాధించారు. కుప్పంలో చంద్రబాబు తొలి రెండు రౌండ్లల్లో ఓడిపోవడం, ఆయన మెజారిటీ 30 వేలకు మాత్రమే పరిమితం కావడంతో కుప్పం కోట బలహీనపడినట్టుగా భావించారు.

sukanya

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి