Revanth Reddy : మునుగోడు యుద్ధం.. రేవంత్ రెడ్డికి అసలు సిసలు పరీక్ష.!
Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కఠిన పరీక్ష ఎదురు కాబోతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తన పదవికి అలాగే పార్టీకి సైతం రాజీనామా చేసిన దరిమిలా, మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతోంది. ఉప ఎన్నిక నిమిత్తం ఇప్పటికే బీజేపీ తనదైన వ్యూహాలు సిద్ధం చేసింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాగూ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మాటేమిటి.?
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మునుగోడులో ఎలాంటి రాజకీయ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. అప్పటికి ఇంకా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కుదురుకోలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి అది కాదు. పీకేస్తా, పొడిచేస్తా.. అంటూ చాలా ఆవేశంగా మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వుంటుందా.? ఊడుతుందా.? అన్నది తేల్చేసే ఉప ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నికని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందా.? రాజీనామా చేసిన సీటులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుస్తారా.? వీళ్ళిద్దరూ కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి ఈ సీటుని ఎగరేసుకుపోతుందా.? అన్నది చర్చనీయాంశమైంది. సరిగ్గా సాధారణ అసెంబ్లీ ఎన్నికలకి ఏడాదిన్నర ముందు మునుగోడు ఉప ఎన్నిక పంచాయితీ తెరపైకొచ్చింది.అంటే, ఈ ఉప ఎన్నిక.. వచ్చే సాధారణ ఎన్నికలకు ప్రిపరేషన్ లాంటిదిగా భావించాలేమో. ఈ సెమీఫైనల్లో తేడా కొడితే, సాధారణ ఎన్నికల నాటికి పీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ ఔట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.!