Contract and Outsourcing Employees : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్
Contract and Outsourcing Employees : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులలో దీర్ఘకాలంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను నిలిపివేస్తూ వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 776 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులను ప్రభుత్వం ఇటీవల మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) ద్వారా భర్తీ చేసింది.
Contract and Outsourcing Employees : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్
కొత్తగా ఎన్నికైన రెగ్యులర్ ఉద్యోగులకు నియామక పత్రాలు
ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయి.. కొత్తగా ఎన్నికైన రెగ్యులర్ ఉద్యోగులకు నియామక పత్రాలు కూడా అందజేశారు. నిబంధనల ప్రకారం.. ఒక పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి నియమితులైనప్పుడు.. ఆ స్థానంలో తాత్కాలికంగా పనిచేస్తున్న వారిని తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్ట్ సిబ్బందిని విధుల నుంచి తక్షణమే తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా చేరిన రెగ్యులర్ ఉద్యోగులకు బాధ్యతలు
ఈ నిర్ణయంపై డీఎంఈ కార్యాలయం శుక్రవారం అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ఒక సర్క్యులర్ పంపింది. కొత్తగా చేరిన రెగ్యులర్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి.. ఆ స్థానాల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియపై తీసుకున్న చర్యలను వివరిస్తూ తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.
వాస్తవానికి.. 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు ఒక ఏడాది కాలానికి వివిధ విభాగాల్లో మొత్తం 16,448 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించేందుకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ కేటగిరీ కింద పని చేసేవారు కూడా ఉన్నారు. తాజాగా రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయడంతో.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేేసే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులు ఇక నుంచి పని చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. దీంతో వారి సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.