YSR VS KCR : వైఎస్సార్ ఎందుకు దేవుడయ్యాడు? కేసీఆర్ ఎందుకు కాలేదు? అభివృద్ధి చేసినా కేసీఆర్ చేసిన తప్పులేంటి?

Authored By Varun G | The Telugu News | Published on: October 14, 2023, 6:00 pm

YSR VS KCR : రాజకీయాల్లో దేవుడు అంటే ఒక ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వైఎస్సార్ పేరు చెప్పుకోవచ్చు. మరి.. తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ మాత్రం దేవుడు కాలేకపోయారు. దానికి కారణాలు ఏంటి. నిజానికి కేసీఆర్ అమలు చేసిన పథకాలను ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయలేదు. చివరకు వైఎస్సార్ కూడా అమలు చేయలేదు. కానీ.. ఆయన తీసుకొచ్చిన పథకాలే విప్లవాత్మకమైనవి. ఉదాహరణకు ఒక ఫీజు రియంబర్స్ మెంట్ కావచ్చు.. ఆరోగ్యశ్రీ కావచ్చు.. ఈ పథకాలను వైఎస్సార్ తన హయాంలో పక్కాగా అమలు చేసి గొప్ప వ్యక్తి అయ్యారు. రూపాయి తీసుకోకుండా కార్పొరేట్ వైద్యం, ఖరీదైన చదువు ఇవ్వడంతో పాటు పాలనతో సరికొత్త మార్క్ చూపించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అందుకే ఆయన దేవుడు అంటారు. కానీ.. కేసీఆర్ నా దేవుడు అని మాత్రం ఎవ్వరూ అనడం లేదు. బీఆర్ఎస్ నేతలు మినహా తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ మా దేవుడు అనలేకపోతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వైఎస్సార్ కంటే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. కానీ.. ఆయన్ను ఎందుకు దేవుడిగా తెలంగాణ ప్రజలు పోల్చుకోలేకపోతున్నారు? తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ చేసిన తప్పులేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కడ తేడా వచ్చింది. వైఎస్ఆర్ కంటే ఎన్నో రెట్లు అభివృద్ధి చేసిన కేసీఆర్ ను ఎందుకు తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోవడం లేదు. వైఎస్సార్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో తన కొడుకు వైఎస్ జగన్ పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయినా వైఎస్సార్ పై ఇంత కూడా మచ్చ తీసుకురాలేదు. కానీ.. కేసీఆర్ అలా కాదు. కేసీఆర్ విషయంలో ఒక్క ఈగోనే ఇన్ని చేసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పెరిగిన రేట్లు, రైతే రాజు అయ్యాడు. కరెంట్ కోతలు లేవు. అనేక సంక్షేమ పథకాలు, రైతులకు సాగు నీరు.. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరం అభివృద్ధి.. ఇలా ఎన్నో పథకాలు స్థాపించారు కేసీఆర్. కానీ.. కేసీఆర్ ను కేవలం సార్ గానే చూస్తున్నారు. కానీ.. దేవుడిలా కొలిచేంత సీన్ మాత్రం లేదు.

YSR VS KCR : కేసీఆర్ ను ప్రజలకు దూరం చేసిందేంటి?

ఇంత చేస్తున్నా కేసీఆర్ ఎందుకు దేవుడు కాలేదు. పేదలు కూడా ఒక రాజకీయ నేతగానే ఎందుకు చూస్తున్నారు అంటే.. కేసీఆర్ ప్రవర్తించిన తీరు వల్లనే. హైదరాబాద్ లో వరదలు వస్తే కేసీఆర్ బయటికి రారు. భారీ వర్షాలకు పంటలు నష్టపోతే రైతులను పట్టించుకోరు. రైతులను ఓదార్చరు. అసలు ప్రజలకు కేసీఆర్ అందుబాటులోనే ఉండరు. ఆపదలో ఉన్నాం అని ఎవరైనా ప్రజలు వస్తే కేసీఆర్ కలవరు.. అసలు కష్టం వస్తే తానున్నానంటూ బయటికి రారు. అందుకే కేసీఆర్ తో ప్రజలకు లింక్ తెగిపోయింది. ఎవరైనా తనను విమర్శిస్తే పట్టించుకోరు కేసీఆర్. పేరుకే ప్రగతి భవన్. ఒక్క సామాన్య వ్యక్తికి కూడా అక్కడికి పర్మిషన్ ఉండదు. కానీ.. వైఎస్సార్ అలా కాదు.. ఎందరో పేదలకు, సామాన్యులకు, కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం చేసేవారు. తానే స్వయంగా వాళ్లతో మాట్లాడేవారు. కానీ.. ఒక సామాన్య వ్యక్తి నేడు కేసీఆర్ ను కలవాలంటే అది జరగని పని.

ఎంత అభివృద్ధి చేసినా, ప్రసంగాలు చేసినా, మేనిఫెస్టోలు ప్రకటించినా ప్రజా కోణం మిస్ అయిందని చెప్పుకోవాలి. అదే ప్రజలకు కేసీఆర్ ను దూరం చేసింది. ప్రజల మధ్య తిరగని వ్యక్తిని ప్రజలు ఎలా ఓన్ చేసుకుంటారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా కేసీఆర్ పట్టించుకోరు. అందుకే కేసీఆర్ అక్కడే ఉండిపోయారు. వైఎస్సార్ మాత్రం ప్రజల గుండెల్లో ఉండిపోయారు. వైఎస్సార్ ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓన్ చేసుకున్నట్టుగా కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోలేకపోయారు.. చేసుకోలేకపోతున్నారు. ఏదో బహిరంగ సభల్లో నాలుగు మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి వెళ్లిపోవడం, సామాన్య ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేకపోతే ఇక ప్రజలు కేసీఆర్ ను ఎందుకు ఓన్ చేసుకోవాలి. ఎక్కడో ఫామ్ హౌస్ లో ఉంటూ రాజకీయాలు చేయడం, బాబూ కష్టాల్లో ఉన్నాం అంటే పట్టించుకునే నాథుడు లేకపోతే జనాలు మాత్రం కేసీఆర్ ను దేవుడిగా కొలవాలి చెప్పండి.. అందుకే కేసీఆర్ సార్ వరకు మాత్రమే వచ్చి ఆగిపోయారు. ఇలాగే కేసీఆర్ మున్ముందు ప్రవర్తిస్తే ఆయన కేవలం ఒక మాజీ సీఎంగానే భవిష్యత్తు తరాలకు పరిచయం అవుతారు.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp