Miryalaguda : మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
ప్రధానాంశాలు:
Miryalaguda : మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి ధర్మనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బత్తుల లక్ష్మారెడ్డి, కేతావత్ శంకర్ నాయక్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సుమారు 75 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ విద్యాసంస్థ అనేక మంది ప్రతిభావంతులను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఈ పాఠశాల నుంచి చదివిన విద్యార్థులు నేటి సమాజంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడి పాఠశాలకు కీర్తి తీసుకొచ్చారని అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు.
Miryalaguda : మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
విద్యే పేదరికాన్ని తొలగించే శక్తివంతమైన ఆయుధమని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఉన్నత విద్య ద్వారా సమాజంలో గౌరవనీయ స్థానం సాధించవచ్చని అన్నారు. కార్యక్రమం సందర్భంగా ఉపాధ్యాయిని జి. బేబీ రాణి తన సొంత ఖర్చుతో విద్యార్థులందరికీ భోజన విందు ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఆమె సేవాభావాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు కొర్ర కృష్ణ కాంత్ నాయక్, ఉపాధ్యాయులు ఉపేందర్, ముంతాజ్ బేగం, తావూరియా, సంతోష్,అనిత జ్యోతి, ధనలక్ష్మి, అశ్విని, స్పందన, బేబీ రాణి, వినోద, కాంతయ్య, మీనా, జానయ్య, జంగయ్య, స్వామి, లక్ష్మయ్య, భవాని, శాంతాబాయి, సుప్రజ,రేణుక, తనూజ, ధనమ్మ,పేరయ్య, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.