Ration Card : రేషన్ కార్డుదారులకి శుభవార్త .. మూడు నెలల కోటాకు సర్వం సిద్ధం .. కానీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : రేషన్ కార్డుదారులకి శుభవార్త .. మూడు నెలల కోటాకు సర్వం సిద్ధం .. కానీ !

 Authored By sudheer | The Telugu News | Updated on :28 March 2026,11:30 am

ప్రధానాంశాలు:

  •   Ration Card : రేషన్ కార్డుదారులకి శుభవార్త .. మూడు నెలల కోటాకు సర్వం సిద్ధం .. కానీ !

Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా సరఫరా ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. గతంలో ఇదే విధానం అమలు చేసినప్పటికీ వచ్చిన ఇబ్బందులపై ఎలాంటి సమీక్ష లేకుండానే మళ్లీ అదే ప్రక్రియను కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది.

Good news for ration card holdersthree months quota from April

Good news for ration card holders..three months quota from April

Ration Card : గోదాముల కొరత .. నిల్వలో ఇబ్బందులు

ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల వారీగా చర్యలు చేపడుతున్నారు. మండల స్థాయి నిల్వ కేంద్రాల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా వేగంగా జరుగుతోంది. అయితే ప్రధాన సమస్య నిల్వ సామర్థ్యం లోపం. చాలా రేషన్ దుకాణాల్లో మూడు నెలల బియ్యాన్ని నిల్వ చేసే సదుపాయం లేదు. దీంతో సరఫరా చేసిన బియ్యం సక్రమంగా నిర్వహించడంలో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా ఇదే సమస్యలు ఎదురైనా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు.

Ration Card : ఈ-పాస్ యంత్రాల సమస్యలు .. లబ్ధిదారుల కష్టాలు

మూడు నెలల బియ్యం పంపిణీకి అవసరమైన సాంకేతిక సన్నాహాలు పూర్తిగా సిద్ధంగా లేవు. ముఖ్యంగా ఈ-పాస్ యంత్రాలు ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వడానికి అనుకూలంగా లేవు. దీంతో ప్రతి లబ్ధిదారుడు మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు కూడా తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఒక్కో వ్యక్తికి బియ్యం అందించడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతోంది. దీని వల్ల రేషన్ షాపుల వద్ద పెద్ద ఎత్తున క్యూలు ఏర్పడుతున్నాయి. డీలర్లు మాత్రం ఒకే సారి వేలిముద్రతో మూడు నెలల బియ్యం అందించే విధంగా సాఫ్ట్‌వేర్ మార్పులు చేయాలని కోరుతున్నారు.

Ration Card : డీలర్ల నష్టం .. తూకం లోపాలపై ఆందోళన

రేషన్ బియ్యం సరఫరాలో తూకం సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. స్టేజ్-1 లారీల ద్వారా వచ్చే బస్తాల్లో కొన్నింటిలో తక్కువ బియ్యం ఉండటం వాటిని తిరిగి తూకం వేయకుండా నేరుగా రేషన్ షాపులకు పంపడం వల్ల డీలర్లు నష్టపోతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదని యూనియన్ నాయకులు అంటున్నారు. ఈ సమస్యలను తగ్గించేందుకు అధికారులు కొన్ని చర్యలు చేపట్టారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి బియ్యం రవాణా నుంచి పంపిణీ వరకు పర్యవేక్షణ పెంచాలని నిర్ణయించారు. సరైన తూకంతో బియ్యం చేరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ మూల సమస్యల పరిష్కారంపై స్పష్టత లేకపోవడం గమనించాల్సిన అంశంగా మారింది. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ నిర్ణయం లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉండాలంటే క్షేత్రస్థాయి సమస్యలను ముందుగానే పరిష్కరించడం అత్యవసరం. లేదంటే మళ్లీ అదే ఇబ్బందులు పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది