Konda Surekha : కాంగ్రెస్లో నాకొచ్చిన గతే మీకూ పడుతుంది: మంత్రులకు కొండా సురేఖ సంచలన హెచ్చరిక
Konda Surekha తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చి తీవ్ర భావోద్వేగంతో విరుచుకుపడ్డారు
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చి తీవ్ర భావోద్వేగంతో విరుచుకుపడ్డారు. బీసీ వర్గానికి చెందిన మహిళా నేతనైన తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ అధిష్ఠానం ఏకపక్షంగా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్కు లేఖ రాయడంపై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష కట్టి, పథకం ప్రకారమే తనను పదవి నుంచి తప్పించారని కొండా సురేఖ స్పష్టం చేశారు.
Konda Surekha : కాంగ్రెస్లో నాకొచ్చిన గతే మీకూ పడుతుంది: మంత్రులకు కొండా సురేఖ సంచలన హెచ్చరిక
Konda Surekha ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా ఆఖరి కోరిక అడుగుతారు.. నాకెందుకు చెప్పలేదు?
తనను తొలగించే ముందు కనీసం ఒక్క మాట కూడా చెప్పకపోవడంపై సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “చట్ట ప్రకారం ఉరిశిక్ష అమలు చేసే ఖైదీకి కూడా ముందే విషయం చెప్పి, చివరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారు. కానీ నన్ను మాత్రం మాటమాత్రమైనా సంప్రదించకుండా నేరుగా బర్తరఫ్ చేశారు” అని కన్నీటిపర్యంతమయ్యారు. తిరుపతి రెడ్డి తదితరులు పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్ర పన్ని పదవి ఊడేలా చేశారని దుయ్యబట్టారు.సుమంత్ వ్యవహారంలోనూ కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. సుమంత్ పేరును అడ్డం పెట్టుకుని క్రైమ్ సెటిల్మెంట్లు చేస్తూ తన కుటుంబాన్ని బద్నాం చేశారని, చివరకు ఆ కేసును సీసీఎస్కు బదిలీ చేయించి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే తనపై ఈ స్థాయి కుట్రలు జరిగాయని వాపోయారు.తనను పదవి నుంచి తప్పించడంలో చక్రం తిప్పిన మల్లు రవి గతంలో పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదా అని సురేఖ ప్రశ్నించారు. ₹50 కోట్లు చెల్లించి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుగోలు చేశారని బహిరంగంగా విమర్శించిన వారిపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధిష్ఠానాన్ని నిలదీశారు. గతంలో దివంగత నేత రోశయ్య ఇందిరా గాంధీ పాలనను ‘విధవ రాజ్యం’ అని విమర్శించినా చర్యలు లేవని గుర్తుచేశారు. ఇటీవల పార్టీలో చేరిన కడియం శ్రీహరి కూడా తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఆయనపై ఎందుకు వేటు వేయలేదని ప్రశ్నించారు. తాము ప్రజల నుంచి పోరాడి వచ్చిన నాయకులమని, తమ జవాబుదారీతనం ఎప్పటికీ ప్రజలకే ఉంటుందని తేల్చిచెప్పారు.
గుండెలపై చేయి వేసుకుని చెప్పండి.. ప్రభుత్వంలో మంత్రులెవరైనా సంతోషంగా ఉన్నారా?
కేవలం తన కూతురు స్వతంత్రంగా మాట్లాడినందుకు తల్లి పదవిని లాగేసుకుంటారా అని కొండా సురేఖ మండిపడ్డారు. ఇదే సందర్భంగా కేబినెట్లోని సహచర మంత్రులకు ఆమె స్పష్టమైన హెచ్చరిక చేశారు. “ఈ రోజు నాకు జరిగిన అన్యాయమే రేపు మీకూ జరుగుతుంది. తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలంతా ఇకనైనా మౌనం వీడి బయటకు వచ్చి గళం విప్పాలి. ప్రభుత్వంలో నడుస్తున్న వ్యవహారాలపై గొంతు ఎత్తకపోతే మున్ముందు భారీ నష్టం తప్పదు” అని హెచ్చరించారు.మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రస్తుతం సంతోషంగా ఉన్నారా అని ఆమె సూటిగా సవాల్ విసిరారు. గుండెల మీద చేయి వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచి ప్రజలకు సేవ చేయలేకపోతున్నామని, అభివృద్ధి పనుల కోసం ఎవరి వద్దకు వెళ్లాలో కూడా అర్థం కాని దయనీయ స్థితిలో శాసనసభ్యులు ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని గుర్తుచేశారు.
తాము బీసీలకు రిజర్వేషన్లు కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్, కేబినెట్లోని ఒకే ఒక్క బీసీ మహిళా మంత్రిని అర్ధంతరంగా ఎలా తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్న వేళ ఈ తరహా ఏకపక్ష పెత్తనం పార్టీకి తీవ్ర చేటు చేస్తుందని హెచ్చరించారు. తానే పదేళ్ల పాటు సీఎంగా ఉంటానని రేవంత్ స్వయంగా ప్రకటించుకోవడం, ముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయడం నియంతృత్వ పోకడ కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హైకమాండ్ను బ్లాక్మెయిల్ చేసి తనను మంత్రివర్గం నుంచి తొలగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ అన్యాయమైన బర్తరఫ్ను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇకపై సాధారణ ఎమ్మెల్యేగా ఉంటూ తన నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి సేవ చేస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.







