KTR : గతంలో పొరపాట్లు జరిగాయి .. సరి చేసుకుంటాం .. కవిత కొత్త పార్టీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR : గతంలో పొరపాట్లు జరిగాయి .. సరి చేసుకుంటాం .. కవిత కొత్త పార్టీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు ..!

 Authored By sudheer | The Telugu News | Updated on :13 April 2026,2:00 pm

ప్రధానాంశాలు:

  •  KTR : గతంలో పొరపాట్లు జరిగాయి .. సరి చేసుకుంటాం .. కవిత కొత్త పార్టీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు ..!

KTR : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తొలిసారి ఆయన స్పందించారు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీ స్థాపించవచ్చని స్పష్టం చేసిన కేటీఆర్‌ వ్యక్తిగత ప్రయోజనాలు లేదా పదవుల కోసం ఏర్పడే పార్టీలు ఎక్కువకాలం నిలవవని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కుటుంబ సంబంధాలపై చేసిన ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

KTR key comments on Kavitha new party

KTR key comments on Kavitha new party..!

KTR : కవిత నిర్ణయంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అనేక పార్టీలకు స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజల విశ్వాసం పొందడం ముఖ్యమని వ్యక్తిగత సమస్యలను రాజకీయ రంగంలోకి తీసుకురావడం వల్ల ప్రజలు నమ్మరని అన్నారు. ఒకరిద్దరు నాయకులు జైలుకు వెళ్లి ముఖ్యమంత్రులయ్యారని ఉదాహరణగా చూపిస్తూ, అదే పరిస్థితి మళ్లీ వస్తుందని భావించడం పొరపాటని కేటీఆర్ చెప్పారు. జైలుకు వెళ్తే సీఎం అవుతారు అనే భావన పూర్తిగా భ్రమ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కుటుంబంపై మాట్లాడుతూ .. పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు గానీ.. ఏడిపించకూడదు అని చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కవితపై పరోక్ష వ్యాఖ్యలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు… KTR : బీఆర్‌ఎస్‌లో అంతర్గత పరిస్థితులపై వివరణ

తమ కుటుంబంలో ఎలాంటి పదవుల వివాదాలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చాలన్న డిమాండ్ ప్రజల నుంచి వచ్చిందని ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గతంలో పార్టీ నుంచి కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించిన ఆయన వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో పార్టీకి, ప్రజలకు మధ్య కొంత దూరం పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ దూరాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడంలో లోపాలు ఉన్నాయని కూడా ఆయన అంగీకరించారు. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికుల కోసం సరైన విధానాన్ని తీసుకురాలేకపోయామని తెలిపారు. ఈ విషయంలో భవిష్యత్తులో స్పష్టమైన పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

KTR : ప్రభుత్వంపై విమర్శలు, భవిష్యత్ కార్యాచరణ

ప్రస్తుత ప్రభుత్వంపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు పక్కనబెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాలన సాగుతోందని అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ.. 2027లో తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ప్రజలతో నేరుగా కలుసుకుని సమస్యలను తెలుసుకునేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక కవిత కొత్త పార్టీ వ్యవహారం కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపాయి. ఈ పరిణామాలు బీఆర్‌ఎస్ భవిష్యత్తుపై తెలంగాణ రాజకీయ దిశపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది