New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేనా.. లబ్ధిదారుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆగ్రహం
New Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది పేద ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా, ఇప్పటివరకు కేవలం 32వేల కుటుంబాలకు మాత్రమే కార్డులు మంజూరయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన, గ్రామసభలు, మీసేవ కేంద్రాల ద్వారా దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు అందగా, కుటుంబసభ్యుల పేర్ల చేర్పుల కోసం 8.10 లక్షల అభ్యర్థనలు వచ్చాయి. అయితే అర్హతలేని వారు లబ్ధి పొందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ప్రస్తుతం 10.50 లక్షల మందికి చేర్పులు పూర్తయ్యి మే నెల రేషన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నారు.
దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది జరుపుతూ, అభ్యర్థుల ఆదాయ స్థితిగతులు, గత రేషన్ కార్డు వివరాలు, తల్లిదండ్రుల పేరిట కార్డుల్లో పేర్లు ఉన్నాయా వంటి అంశాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే మరో రెండు నెలల్లో మిగిలిన అర్హులకూ కార్డులు మంజూరయ్యే అవకాశం ఉంది. మే నెల నాటికి రాష్ట్రంలో రేషన్ లబ్దిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరినట్టు సమాచారం. కొత్తగా 11.15 లక్షల మంది ఈ జాబితాలో చేరారు. జనవరి నుండి ఏప్రిల్ వరకు 19.15 లక్షల మంది లబ్దిదారులుగా గుర్తించగా, పాత కార్డుల నుంచి 7.10 లక్షల పేర్లు తొలగించబడ్డాయి.

New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేనా.. లబ్ధిదారుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆగ్రహం
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కోటా కోలాహలంగా కొనసాగుతోంది. బియ్యం మొదటి రోజు నుంచే డీలర్ల వద్ద క్యూ కడుతున్న లబ్దిదారుల రద్దీతో సరఫరా ఐదు రోజులలోనే పూర్తవుతోంది. ఏప్రిల్లో 90 శాతం మందికి రేషన్ అందినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో డీలర్లు పూర్తిగా కోటా తెప్పించకపోవడంతో కొందరికి రేషన్ అందలేదు. మే నెలలో కొత్త లబ్దిదారులు పెరగడంతో పంపిణీ మరింత గిరాకీగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరఫరా వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది.