Chandrababu Naidu : స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులను పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేశారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కర్నూలు జిల్లా మంత్రాలయం పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రాలయం మండలం మాధవరంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపై ఆయన విస్తృతంగా చర్చించారు.టీడీపీకి కార్యకర్తలే అసలైన బలం అని, కార్యకర్తల సంక్షేమం, గౌరవం పార్టీకి అత్యంత ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని, కార్యకర్తల కృషి వల్లే పార్టీ విజయాలు సాధిస్తోందని పేర్కొన్నారు.
Chandrababu Naidu : స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
Chandrababu Naidu మంత్రాలయంలో వర్గ రాజకీయాలకు చోటు లేదన్న చంద్రబాబు
మంత్రాలయం నియోజకవర్గంలో వర్గ రాజకీయాలకు తావు లేకుండా పార్టీ నేతలు కలిసికట్టుగా పనిచేయాలని సీఎం సూచించారు. వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి, ఎన్. రాఘవేంద్ర రెడ్డి వర్గాలపై జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు చెక్ పెట్టారు. పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు ఉండకూడదని, అందరూ ఒకే జెండా కింద పనిచేయాలని స్పష్టం చేశారు.మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డికి పూర్తి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు సూచించిన చంద్రబాబు, తిక్కారెడ్డి సేవలను పార్టీ రాష్ట్ర స్థాయిలో వినియోగించుకుంటామని వెల్లడించారు. ఇద్దరూ కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.2029 ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాఘవేంద్ర రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్.. గెలుపే లక్ష్యంగా పని చేయాలి
మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నెరవేర్చిన ఎన్నికల హామీలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు అందుతున్నాయా? లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారా? అనే అంశాలపై కార్యకర్తలు నిరంతరం ఫీడ్బ్యాక్ సేకరించాలని సూచించారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ స్థాయిలో కృషి చేయాలని తెలిపారు.
గ్రామ స్థాయిలో పార్టీ ప్రతిష్టను పెంచేందుకు కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకం కావాలని, స్థానిక సమస్యలపై స్పందిస్తూ ప్రజాభిమానాన్ని పొందాలని సూచించారు.అంతేకాకుండా, స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ యంత్రాంగం పనిచేయాలని పిలుపునిచ్చారు.స్థానిక ఎన్నికల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నాయకులను పక్కనపెట్టి కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తామని ఆయన సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కూటమి పార్టీలతో సమన్వయం కీలకం
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీల సహకారం టీడీపీ విజయానికి ఎంతో దోహదపడిందని చంద్రబాబు గుర్తుచేశారు. భవిష్యత్తులో కూడా కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.2024 ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయడం వల్లే అఖండ విజయం సాధించామని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేస్తే భారీ విజయాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక రాబోయే ఎన్నికల్లో పార్టీ ఏ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.







