Andhra Pradesh Capital : ఏపీకి రాజధాని ఏది.. అమరావతా..? విశాఖనా..?

Authored By aruna | The Telugu News | Updated on: May 24, 2024, 12:17 pm

Andhra Pradesh Capital : ఏపీకి రాజధాని అంశం ఇప్పుడు కీలకంగా మారిపోయింది. ఏపీ విడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా మార్చింది. అందుకోసం రైతుల నుంచి ఏకంగా 36 వేల ఎకరాలను సేకరించింది. కానీ పెద్దగా అభివృద్ధి మాత్రం చేయలేకపోయింది. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించారు. కానీ కోర్టులో కేసుల వల్ల విశాఖను పరిపాలన రాజధానిగా చేయలేకపోయారు. ఆ ప్రకటననను ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి విశాఖ రాజధాని అంశం పెండింగ్ లోనే ఉంది.

రెండు పార్టీలు కలిసి..

ఇటు అమరావతిని ఏపీకి రాజధానిగా గుర్తించట్లేదు. దాంతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఈ కారణంగా ఏపీ అందరి ముందు నవ్వుల పాలు కావాల్సి వస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. రెండు పార్టీలు కలిసి ఏపీకి రాజధాని లేకుండా చేశాయని ప్రజల్లో కోపం ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయాయి. ఏ పార్టీ గెలుస్తుందో అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. జూన్ 2తో ఉమ్మడి రాజధాని హక్కు ముగుస్తుంది.

దాంతో ఆ తర్వాత ఏపీకి రాజధాని అనేది లేకుండా పోతుంది. అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగా మారుతుంది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ లో పేర్కొంటే మాత్రం అమరావతి శాశ్వత రాజధాని అవుతుంది. అలా కాకుండా వైసీపీ అధికారంలోకి వచ్చి విశాఖను రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం అప్పుడు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దానిమీద నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి కేంద్రంలో బీజేపీ వస్తే మాత్రం కచ్చితంగా అమరావతి రాజధానిగా మారుతుంది. అలా కాదని వైసీపీ గెలిస్తే మాత్రం అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది అందరూ వేచి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వైసీపీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనేది చూడాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp