Personal Loan repayment after death : పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ అప్పు ఎవరు కట్టాలి? బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
Personal Loan repayment after death : అనుకోని పరిస్థితుల్లో రుణం తీసుకున్న వ్యక్తి (Borrower) మరణిస్తే, ఆ అప్పు ఏమవుతుంది? అనేది చాలామందికి వచ్చే సందేహం. ఆ వ్యక్తితో పాటే అప్పు కూడా రద్దవుతుందా? లేక ఆ భారం కుటుంబ సభ్యులపై పడుతుందా? దీనిపై చాలామందికి సరైన అవగాహన ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే.. వ్యక్తి మరణించినంత మాత్రాన అప్పు రద్దు కాదు. అలాగని, ఆ అప్పు ఆటోమేటిక్గా భార్యాపిల్లలకు బదిలీ కూడా కాదు. ఆ లోన్ రకాన్ని బట్టి, దానికి ఉన్న ష్యూరిటీని బట్టి ఎవరు కట్టాలనేది నిర్ణయించబడుతుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Personal Loan repayment after death : పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ అప్పు ఎవరు కట్టాలి? బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
Personal Loan repayment after death : వ్యక్తిగత రుణం (Individual Loan) తీసుకుని ఉంటే
ఒక వ్యక్తి ఎలాంటి కో-బారోవర్ (జాయింట్ అకౌంట్) లేకుండా కేవలం తన పేరు మీదనే పర్సనల్ లోన్ తీసుకుంటే, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత పూర్తిగా ఆ వ్యక్తిదే. సదరు వ్యక్తి మరణించిన తర్వాత, బ్యాంకు వారు మృతుడి కుటుంబ సభ్యులను లేదా వారి పిల్లలను అప్పు తీర్చమని ఒత్తిడి చేయడానికి వీల్లేదు (వారు లీగల్ హెయిర్స్ అయినప్పటికీ). అయితే, బ్యాంకుకు ఉన్న ఒకే ఒక మార్గం.. మరణించిన వ్యక్తి పేరిట ఉన్న ఆస్తులు (Estate). మృతుడి పేరిట ఉన్న సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, లేదా ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుని బ్యాంకు తమ బాకీని రాబట్టుకోవచ్చు. ఉదాహరణకు, మరణించిన వ్యక్తికి రూ.10 లక్షల ఆస్తి ఉండి, రూ.3 లక్షల అప్పు ఉందనుకోండి. బ్యాంకు ఆ రూ.3 లక్షలను ఆస్తి నుంచి తీసుకున్నాకే, మిగిలిన రూ.7 లక్షలు వారసులకు దక్కుతాయి. ఒకవేళ ఆస్తులు ఏమీ లేకపోతే, బ్యాంకు ఆ రుణాన్ని “రైట్ ఆఫ్” (Write off) చేయాల్సిందే తప్ప, కుటుంబ సభ్యుల సొంత సంపాదనను అడగకూడదు.
Personal Loan repayment after death : కో-బారోవర్ (Co-borrower) ఉంటే
చాలామంది లోన్ ఎలిజిబిలిటీ పెరగడం కోసం భార్య లేదా భర్తతో కలిసి జాయింట్ లోన్ (Joint Loan) తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒకరు మరణిస్తే, మిగిలిన అప్పును తీర్చాల్సిన పూర్తి బాధ్యత బతికున్న కో-బారోవర్ (Surviving borrower) పైనే ఉంటుంది. లోన్ అగ్రిమెంట్ ప్రకారం ఇద్దరూ సమాన బాధ్యులు కాబట్టి, బ్యాంకు వారి నుంచి ఈఎంఐలు వసూలు చేస్తుంది.
లోన్ తీసుకున్నప్పుడు ఎవరైనా గ్యారెంటర్ (జామీను) సంతకం చేసి ఉంటే, పరిస్థితి మారుతుంది. ప్రాథమిక రుణగ్రహీత మరణిస్తే, ఆ అప్పును తీర్చే బాధ్యత చట్టపరంగా గ్యారెంటర్పై పడుతుంది. మృతుడి ఆస్తుల ద్వారా అప్పు తీరకపోతే, బ్యాంకు గ్యారెంటర్ను సంప్రదిస్తుంది. అవసరమైతే గ్యారెంటర్ ఆస్తులను కూడా జప్తు చేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. అందుకే ఎవరికైనా జామీను సంతకం పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
లోన్ ఇన్సూరెన్స్ (Loan Insurance) ఉంటే
ఇది అత్యంత సురక్షితమైన పద్ధతి. పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడే చాలామంది “క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్” (Loan Protection Insurance) తీసుకుంటారు. లోన్ యాక్టివ్గా ఉన్న సమయంలో రుణగ్రహీత మరణిస్తే, మిగిలిన అప్పు మొత్తాన్ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీయే బ్యాంకుకు చెల్లిస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులపై లేదా ఆస్తులపై ఎలాంటి భారం పడదు. అయితే, ఈ ఇన్సూరెన్స్ ఉందో లేదో కుటుంబ సభ్యులు సరిచూసుకోవాలి. రుణగ్రహీత మరణించిన వెంటనే బ్యాంకుకు సమాచారం అందించి, మరణ ధృవీకరణ పత్రాన్ని (Death Certificate) సమర్పించాలి.
అప్పు అనేది మనిషితో పాటే పోదు, కానీ అలాగని అది కుటుంబానికి గుదిబండగా మారకూడదు. లోన్ డాక్యుమెంట్లపై స్పష్టత ఉండటం, సాధ్యమైనంత వరకు లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల క్లిష్ట సమయాల్లో కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుకోవచ్చు.
(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. చట్టపరమైన సలహాల కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.)