Ghatkesa : ముస్లిం సోదరులకు ‘ఈద్ కా తోఫా’ పంపిణీ
ప్రధానాంశాలు:
Ghatkesa : ముస్లిం సోదరులకు ‘ఈద్ కా తోఫా’ పంపిణీ
Ghatkesa : ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్కేసర్ డివిజన్లో నారాయణ ఫంక్షన్ హాల్ వేదికగా ముస్లిం సోదరులకు “ఈద్ కా తోఫా” రంజాన్ కానుకలను ఘనంగా పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు అవసరమైన సరుకులను అందజేస్తూ, ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సందర్భంలో ముస్లిం సోదరులకు అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ పథకం అమలు అవుతోందన్నారు. పండుగల అసలు భావం పరస్పర సహకారం, సోదరభావం, సామరస్యం అని ఆయన అన్నారు. “ఈద్ కా తోఫా” ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉపశమనం లభిస్తుందని, ప్రతి కుటుంబం ఆనందంగా పండుగను జరుపుకోవడానికి ఇది తోడ్పడుతుందని తెలిపారు.
రంజాన్ మాసం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని, నియమ నిష్ఠలతో జీవించేందుకు ఈ నెల ప్రేరణనిస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గంలో బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్, మాజీ ఛైర్మెన్ మల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్లు మాజీ ప్రజా ప్రతినిధులు ముస్లిం సోదరులు మరియు ఇతర నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజలు ఈ పథకంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అభినందించారు.