2023 Year Roundup : 2023 మనకేం ఇచ్చింది.. ఏం ఇవ్వలేకపోయింది.. 2023 ఇయర్ రౌండప్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

2023 Year Roundup : 2023 మనకేం ఇచ్చింది.. ఏం ఇవ్వలేకపోయింది.. 2023 ఇయర్ రౌండప్..!

 Authored By gatla | The Telugu News | Updated on :30 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  చంద్రయాన్ 3 సక్సెస్

  •  వరల్డ్ కప్ ఫెయిల్యూర్

  •  ఒడిశా రైలు ప్రమాదం.. మణిపూర్ అల్లర్లు

2023 Year Roundup : 2023.. కొన్ని గంటల్లో ఇది గతం కానుంది. 2023 అనే సంవత్సరం ఒక గతంగా కొన్ని గంటల్లో మారబోతోంది. 2024 కు ప్రపంచమంతా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అసలు 2023 మనకు ఏం ఇచ్చింది.. ఏం ఇవ్వలేకపోయింది.. 2023 లో మనకు ఉన్న మెమోరీస్ ఏంటి.. ఆ జ్ఞాపకాలను ఓసారి నెమరువేద్దాం రండి. 2023 గురించి చెప్పాలంటే ఒక చంద్రయాన్ గురించి చెప్పుకోవచ్చు. అది సక్సెస్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే.. జీ20 సదస్సు, మణిపూర్ అల్లర్లు, ఒడిశా రైళ్ల యాక్సిడెంట్, ఇలా ఈ సంవత్సరం గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి.అందులో ప్రధానమైంది అంటే జనాభా గురించి మాట్లాడుకోవాలి.. ఒకప్పుడు ఈ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అంటే టక్కున చైనా అని చెప్పేవాళ్లం. కానీ.. ఇక నుంచి ఇండియా అని చెప్పుకోవాలి. అవును.. ఈ సంవత్సరం ఏప్రిల్ లోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం భారత్ జనభా 142.86 కోట్లు. భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో నిలిచింది.

2023 Year Roundup : చంద్రయాన్ 3.. ఒడిశా రైలు దుర్ఘటన

ఆ తర్వాత చెప్పుకోవాల్సింది చంద్రయాన్ 3 సక్సెస్ గురించి. చంద్రయాన్ 3 సక్సెస్ తో ప్రపంచమంతా భారత్ వైపు చూసింది. స్పేస్ రంగంలో తామే నెంబర్ వన్ అని అనుకుంటున్న యూఎస్, రష్యా, చైనాలకు భారత్ షాకిచ్చింది. చంద్రుడి మీద ఉన్న సౌత్ పోల్ పై విక్రమ్ లాండర్ ను పంపించింది. విజయవంతంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి మీద దక్షిణ దృవంపై కాలుమోపాయి. దీంతో ఒక్క భారత్ మాత్రమే కాదు.. ప్రపంచమంతా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయనపై సాక్షి మాలిక్, బబ్లింగ్ పునియా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అంతే కాదు.. రెజ్లర్లు అంతా ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది రాహుల్ గాంధీపై అనర్హత వేటు గురించి. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కాగా.. రెండేళ్ల జైలు శిక్షను కూడా కోర్టు విధించింది. ఆ తర్వాత స్టే తెచ్చుకొని మళ్లీ పార్లమెంట్ లో అడుగు పెట్టారు రాహుల్ గాంధీ.

మరోవైపు మణిపూర్ రాష్ట్రంలో రిజర్వేషన్ల విషయంలో చాలా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక వర్గం రిజర్వేషన్ విషయంలో మరో వర్గం గొడవలు చేసింది. దీంతో రాష్ట్రమంతా అల్లకల్లోలం అయింది. ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇక.. భారత్ కు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చింది.ఈ సంవత్సరం రైలు యాక్సిడెంట్ తీవ్ర విషాదం నింపింది. ఒడిషా రాష్ట్రంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఢీకొనడంతో 300 మంది చనిపోయారు. సుమారు 1200 మంది గాయపడ్డారు. ఆ తర్వాత జీ20 సదస్సు భారత్ లో జరగడంతో ప్రపంచ అగ్ర నేతలంతా భారత్ లో అడుగు పెట్టారు.

ఇక.. అందరినీ ఈ సంవత్సరం బాధించిన విషయం.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 మిస్ అవ్వడం. ఫైనల్ మ్యాచ్ లో భారత్.. వరల్డ్ కప్ ను పోగొట్టుకుంది. అతి నమ్మకం భారత్ ను ఫైనల్ లో దెబ్బతీసింది. ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే భారత్ వన్డే ప్రపంచ కప్ ను సాధించగలిగింది. ఈసంవత్సరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో కూడా జరిగాయి. తెలంగాణలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేశాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పాటయింది.ఉత్తరాఖండ్ లో ఉన్న ఉత్తరకాశీ సొరంగం కూలిపోవడంతో అందులో 41 మంది కూలీలు చిక్కుకున్నారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 17 రోజులు శ్రమించి ఆ కూలీలను బయటికి తీశారు.

లోక్ సభలోకి ఇద్దరు దుండగులు వింటర్ సెషన్స్ జరుగుతున్న సమయంలో దూసుకొచ్చారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. లోక్ సభలోకి దుండగులు దూసుకురావడం నిజంగా పార్లమెంట్ లో భద్రతా వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. దీనిపై కేంద్ర హోమ్ మంత్రిపై విపక్షాలు మండిపడ్డాయి. ఒక దుండగుడు గ్యాలరీ నుంచి కిందికి దూకుతూ నినాదాలు చేయగా, మరొక దుండగుడు పొగను లోక్ సభలో వదిలాడు.మొత్తం మీద ఈ సంవత్సరం చెప్పుకోవాల్సిన ఘటనలు అంటే చంద్రయాన్ సక్సెస్, జీ20 సదస్సు.. ఇవే మధుర జ్ఞాపకాలు అని చెప్పుకోవచ్చు. చేదు ఘటనలు అయితే చాలానే జరిగాయి. ఒడిశా రైతు ప్రమాదం, మణిపూర్ ఘర్షణలు, రెజ్లర్లపై లైంగిక వేధింపులు, రాహుల్ గాంధీపై అనర్హత వేటు, వరల్డ్ కప్ మిస్, పార్లమెంట్ లో సెక్యూరిటీ బ్రీచ్ లాంటివి చెప్పుకోవచ్చు.

gatla

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి