Huzurabad bypoll : హుజూరాబాద్ ఉప ఎన్నిక .. కేసిఆర్ నెత్తిన పాలు పోసిన కేంద్ర ఎన్నికల సంఘం ?
Huzurabad bypoll హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పరిణామాలు చకచక మారిపోతున్నాయి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్కు కొత్త చిక్కు వచ్చి పడింది. షెడ్యూల్ విడుదల కావడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు బ్రేక్ పడినట్టే అయ్యింది. గతంలో ఎన్నడూలేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కఠిన నిబంధనలు విధించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించవద్దని నిబంధన విధించింది. అక్టోబర్ 2న హుజూరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలతో సభకు ఆటంకాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
500కు మించి జనసమీకరణ ఉండకూడదని ఈసీ ఆంక్షలు విధించింది. బండి సంజయ్ వెంట రోజూ పాదయాత్రకు వందలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నారు. బయట నుంచి వాహనాలు వస్తే సీజ్ చేస్తామని ఎన్నికల సంఘం అంటోంది. దీంతో పాదయాత్ర ఎలా అనే చర్చ తెరపైకి వచ్చింది. హుజూరాబాద్ కు చేరేలా ఉద్దేశించిన పాదయాత్రకు ఈసీ నిబంధనలు అడ్డంకిగా మారాయి.
కరీంనగర్ లోకి పాదయాత్ర Huzurabad bypoll
బండి సంజయ్ పాదయాత్ర కరీంనగర్ లోకి ప్రవేశిస్తుంది. అయితే హుజూరాబాద్కు వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో, పాదయాత్ర రూట్ మ్యాప్ పై టీ బీజేపీ కసరత్తు చేస్తోంది. హుజూరాబాద్కు వెళ్ళకుండా హుస్నాబాద్కు వెళ్తే ఎలా ఉంటుందని పెద్దలు ఆలోచిస్తున్నారు. పాదయాత్ర మొదటి విడత ముగింపు సభ భారీ జనసమీకరణతో చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాకు సమీపంలో ఉన్న ప్రాంతంలోనే సభకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బైపోల్ లో బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న ఈటెల రాజేందర్ కు మద్ధతు ప్రకటించాలని, పాదయాత్రతో ఊపు తేవాలని భావించిన కమలదండుకు ..
ఈసీ నిర్ణయాలు తీరని కష్టాల్ని తెచ్చిపెట్టనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈనేపథ్యంలో బైపోల్ లో ఈటెల రాజేందర్ ఒంటరి పోరు తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాదయాత్రకు బ్రేక్ పడడంతో, ఈటెల రాజేందర్ సైతం స్థానికంగా ఓటర్లని వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు బీజేపీ తరఫున కేవలం నేతలు మాత్రమే వెళ్లనున్నారని తెలుస్తోంది. సభలకు నిబంధనలు అడ్డురావడంతో ఏం చేయాలన్నదానిపై రాష్ట్ర నేతలు మంతనాలు సాగిస్తున్నారు. దీంతో బీజేపీ నెక్ట్స్ స్టెప్ ఏమిటోనన్న చర్చ సర్వత్రా సాగుతోంది.