Rohith- Kohli | రోహిత్- కోహ్లీకి ఆస్ట్రేలియా సిరీసే చివరిదా.. బీసీసీఐ క్లారిటీ..!
Rohith- Kohli | భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ మూడు వన్డేల సిరీస్లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పాల్గొననున్నారు. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్పైనే దృష్టి సారిస్తున్నారు. అయితే, ఇటీవల రోహిత్ వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు, ఈ సిరీస్ ద్వయానికి చివరిదని ప్రచారం సాగుతోంది.
#image_title
అంతా అవాస్తవం..
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. రోహిత్, కోహ్లీల రిటైర్మెంట్పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. “రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా ఆటగాళ్ల వ్యక్తిగత అంశం. బీసీసీఐ ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోదు. వారిద్దరూ భారత జట్టుకు విలువైన ఆటగాళ్లు. ఆసీస్ వంటి బలమైన జట్టుపై విజయం సాధించేందుకు వీరి అనుభవం కీలకం” అని రాజీవ్ శుక్లా అన్నారు.
అలాగే, రోహిత్, కోహ్లీలకు ఇది చివరి సిరీస్ అన్న ప్రచారాన్ని ఖండించారు. “ఇది వారి చివరి సిరీస్ కాదు. అలాంటి ఊహాగానాలు అవసరం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.