Jagan Photos : కూటమి పాలనలో జగన్ ఫొటోతో సర్టిఫికెట్లు!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోలతో (Jagan Photos) కూడిన సర్టిఫికెట్లు జారీ కావడం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లాలోని బ్రాడీపేటలో దివ్యాంగ సర్టిఫికెట్లపై జగన్ ఫోటోలు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం మారి దాదాపు ఏడాదైనప్పటికీ, సచివాలయం సిబ్బంది ఇంకా పాత ఫార్మాట్లోనే ధ్రువపత్రాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు.

#image_title
ఈ విషయంపై మీడియాలో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులైన సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో, వారు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. లబ్ధిదారులకు జారీ చేసిన సర్టిఫికెట్లను వెనక్కి తీసుకొని, కొత్తవి జారీ చేశారు. ఇందులో జగన్ ఫోటో లేకుండా కేవలం ప్రభుత్వ లోగోతో కూడిన సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనకు బాధ్యులైన సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక ధ్రువపత్రాలపై కొత్త ప్రభుత్వ అధినేత ఫోటో కానీ, ప్రభుత్వ లోగో కానీ ఉండాలి. పాత ప్రభుత్వం ఫార్మాట్ ను వాడటం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారులలో ఒక హెచ్చరికగా నిలిచింది.