Grain ATM : వచ్చేస్తున్నాయి ‘రైస్ ఏటీఎంలు’.. కార్డు పెడితే చాలు, కిలోల కొద్దీ బియ్యం మీ చేతికి..!
ప్రధానాంశాలు:
Grain ATM : వచ్చేస్తున్నాయి 'రైస్ ఏటీఎంలు'.. కార్డు పెడితే చాలు, కిలోల కొద్దీ బియ్యం మీ చేతికి..!
Grain ATM : సాధారణంగా ఏటీఎం ( ATM ) అనగానే మనకు గుర్తొచ్చేది డబ్బులు. కార్డు పెట్టి కావాల్సినంత క్యాష్ తీసుకుంటాం. కానీ, ఇకపై ఏటీఎం అంటే కేవలం డబ్బులే కాదు.. బియ్యం, గోధుమలు కూడా గుర్తుకు రాబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే! కార్డు పెడితే చాలు.. మనకు కావాల్సిన రేషన్ బియ్యం, గోధుమలు టపటపా బయటకు వచ్చే ‘గ్రెయిన్ ఏటీఎంలు’ (Grain ATMs) వచ్చేస్తున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ( PDS )లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
Grain ATMs : వచ్చేస్తున్నాయి ‘రైస్ ఏటీఎంలు’.. కార్డు పెడితే చాలు, కిలోల కొద్దీ బియ్యం మీ చేతికి..!
Grain ATM : ఎక్కడ మొదలవుతున్నాయి?
కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్ట్ కింద బీహార్ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజధాని పాట్నాలో మూడు చోట్ల ఈ ధాన్యం ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేసింది. వాస్తవానికి, దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎంను 2024 ఆగస్టులోనే ఒడిశాలోని భువనేశ్వర్లో ప్రారంభించారు. ఇప్పుడు దీనిని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నారు.
Grain ATM : ఏంటీ గ్రెయిన్ ఏటీఎం? ఎలా పనిచేస్తుంది?
ఇది అచ్చం మనం డబ్బులు తీసుకునే ఏటీఎం లాంటిదే. కానీ ఇందులో నోట్లకు బదులు ధాన్యం వస్తుంది. జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం కింద లబ్ధిదారులకు బియ్యం, గోధుమలను పంపిణీ చేయడానికి ఈ ఆటోమేటెడ్ యంత్రాన్ని రూపొందించారు. రేషన్ కార్డు లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వివరాలను నమోదు చేసి, బయోమెట్రిక్ ద్వారా తమ ఐడెంటిటీని నిర్ధారించుకోవాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, తమకు ఏ ధాన్యం కావాలి (బియ్యం, గోధుమలు), ఎంత పరిమాణం కావాలి అనేది స్క్రీన్ పై ఎంచుకోవాలి. క్షణాల్లోనే ఆ మెషిన్ కింద ఉన్న బకెట్ లేదంటే సంచిలోకి ధాన్యాన్ని నింపుతుంది. ఈ లావాదేవీ వెంటనే ఆన్ లైన్ లో నమోదవుతుంది.
కేవలం 5 నిమిషాల్లో 50 కిలోలు
ఈ ఏటీఎం పనితీరు చాలా వేగంగా ఉంటుంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే దాదాపు 50 కిలోల వరకు ధాన్యాన్ని ఇది పంపిణీ చేయగలదు. అంతేకాదు, ఇది విద్యుత్ ఆదాలోనూ మేటి. గంటకు కేవలం 0.6 వాట్ల విద్యుత్ మాత్రమే దీనికి అవసరమవుతుంది. సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్ల సాయంతో కూడా దీనిని నడపవచ్చు.
ఎందుకు తీసుకొస్తున్నారు?
రేషన్ షాపుల్లో తూకం విషయంలో మోసాలు జరుగుతున్నాయని, అర్హులకు సక్రమంగా సరుకులు అందడం లేదని తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. అలాగే రేషన్ డీలర్ల దగ్గర గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికే ఈ ‘గ్రెయిన్ ఏటీఎం’లను తీసుకొస్తున్నారు. దీనివల్ల రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని, లబ్ధిదారులకు కచ్చితమైన తూకంతో సరుకులు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం పాట్నాలో పైలట్ ప్రాజెక్టుగా రెండు, మూడు నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. అక్కడ విజయవంతమైతే.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ రైస్ ఏటీఎంలు దర్శనమిచ్చే అవకాశం ఉంది.