Sisters | చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదంలో మరణించిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు
Sisters | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకరలారీ ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో 24 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు , అలాగే 11 మంది మహిళలు, 10 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
#image_title
ఒకే కుటుంబం..
గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అత్యంత హృదయవిదారకమైన అంశం ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లళ్లు ఒకేసారి మృతి చెందడం. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన తనూషా, సాయి ప్రియా, నందిని ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కలలతో, ఆశలతో హైదరాబాద్ వైపు బయలుదేరిన వీరి ప్రయాణం దురదృష్టవశాత్తు అర్థాంతరంగా ముగిసింది.
ఢీకొట్టిన శబ్దం విన్న క్షణాల్లోనే చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. కంకరతో నిండిన లారీ బస్సు కుడి వైపున చీల్చుకుపోవడంతో అక్కడి ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి పోలీసులు, స్థానికులు జేసీబీల సాయంతో కంకర తొలగించి రక్షించే ప్రయత్నం చేశారు. ప్రయాణికుల ఆర్తనాదాలు అక్కడ ఉన్నవారి మనసులను పిండేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది.