Manchryala : భార్య భర్త అనుబంధమంటే ఇదే కాదా .. భర్త చనిపోయిన కాసేపటికే భార్య కూడా .. !
ప్రధానాంశాలు:
Manchryala : భార్య భర్త అనుబంధమంటే ఇదే కాదా .. భర్త చనిపోయిన కాసేపటికే భార్య కూడా .. !
Manchryala : మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత (30)కు 14 నెలల క్రితం తాండూరు మండలం చంద్రుపల్లికి చెందిన కుంబాల నరేష్ (34)తో ప్రేమ వివాహం జరిగింది. సంతోషంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో అకస్మాత్తుగా దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 17న నరేష్ నిద్రమత్తులో ఇంటి మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అత్యవసర శస్త్రచికిత్స చేపట్టారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని, అతను జీవచ్ఛవంలా మారే అవకాశముందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. భర్త పరిస్థితి విషమంగా ఉండటాన్ని తట్టుకోలేక మమత తీవ్ర మనోవేదనకు గురైంది.
అదే రోజు రాత్రి కరీంనగర్-తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో ఆమె ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న నరేష్ ఆరోగ్యం మరింత విషమించింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించక ఆదివారం ఉదయం అతను కన్నుమూశాడు. ఆరు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలో కూడా శోకచ్ఛాయలు కమ్ముకున్నాయి. ప్రేమతో ప్రారంభమైన వారి జీవితం ఇలా విషాదాంతం కావడం స్థానికులను కలచివేసింది. ఈ సంఘటన కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా గ్రామస్తులను సైతం దుఃఖసాగరంలో ముంచేసింది.