రెండేళ్లకే కేసీఆర్ గ్రాఫ్ అమాంతం పడిపోవడానికి అసలు సిసలైన కారణాలు ఇవే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 December 2020,8:12 am

టీఆర్ఎస్ పార్టీ. నిజానికి ఈ పార్టీ రాజకీయ పార్టీగా ఉద్భవించలేదు. ఇది ఓ ఉద్యమ పార్టీ. 2001 లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఓ సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణలో ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. తెలంగాణ ప్రజలనంతా ఏకం చేసి.. ఢిల్లీ మెడలు వచ్చి తెలంగాణను తీసుకొని రావడానికి కనీసం 13 ఏళ్లు పట్టింది. ఎవరు ఏమన్నా.. అనకున్నా.. తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్. ఆయన ముందడుగు వేయకపోయి ఉంటే.. తెలంగాణ వచ్చి ఉండేది కాదు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇంత సంతోషంగా ఉండి ఉండేవారు కాదు. అది వేరే విషయం.

within two years cm kcr graph totally down in telangana

within two years cm kcr graph totally down in telangana

2014లో తెలంగాణ వచ్చిన తర్వాత… ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా మారింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలాగే 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి రెండోసారి పట్టం కట్టారు ప్రజలు. అయితే.. తెలంగాణను తీసుకురావడంలో కేసీఆర్ ఎంత కసి చూపించారో.. తెలంగాణ వచ్చాక తెలంగాణ అభివృద్ధి కోసం అంతగా ఆయన పాటుపడటం లేదు అనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది.

నిజానికి.. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న కొన్ని పథకాలు బ్రహ్మాండమైనవి.. ఎక్కడ లేనివి. కానీ.. ఎందుకో తెలంగాణ ప్రజలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పై తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే మండిపడుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే తెలంగాణలో కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా వ్యతిరేకత వచ్చేసింది. అది ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలిపోయింది.

కేసీఆర్ శకం ముగిసినట్టేనా?

ప్రతిపక్షాలు దీన్ని అలుసుగా తీసుకొని తెలంగాణలో కేసీఆర్ శకం అయిపోయిందని.. ఆయన పప్పులేవీ ఉడకవని.. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకోవడం లేదని.. అంటున్నారు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు అని అంతా అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బీజేపీ పార్టీ పుంజుకోవడం.. వరుసగా విజయాలతో దూసుకెళ్లడం.. అధికార పార్టీతో పాటు.. మిగితా పార్టీలకు కూడా ఇది మింగుడు పడని విషయం.

అయితే.. రెండేళ్లలోనే ఇంతలా కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వాటిలో నియంత పాలన అని అంటున్నారు. కేసీఆర్ ది నియంత పాలనలా ఉందని.. ఆయన చెప్పేదే అందరూ వినాలి కానీ.. ఎదుటివారు చెప్పేది ఆయన వినరని.. అదే కేసీఆర్ పతనానికి కారణం అవుతోందంటున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఏవైనా విపత్తులు చోటు చేసుకున్నా… పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చోటు చేసుకున్నా.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ ప్రాంతాలను సందర్శించాల్సిన బాధ్యత ఉంటుందని.. ప్రజలను ఓదార్చాల్సిన బాధ్యత తనపై ఉంటుందని… కానీ.. మొన్న హైదరాబాద్ లో భారీ వరదలు వచ్చినప్పుడు కనీసం బయటికి కూడా రాలేదని.. ప్రజలను ఓదార్చలేదన్నది కూడా ఒక కారణమని అంటున్నారు.

ఫామ్ హౌస్ సీఎం.. అంటూ కేసీఆర్ కు ముద్ర పడిపోయిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్ నుంచి సీఎం కేసీఆర్ బయటికి వెళ్లరని.. అక్కడి నుంచే పాలన చేస్తున్నారని.. అనవసరంగా మంచిగా ఉన్న సచివాలయాన్ని కూల్చేసి… ఫామ్ హౌస్ నుంచి పాలిస్తున్నారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి