Nagarkurnool District : కుమ్మెర ఘటనపై బీసీ జేఏసీ ఆగ్రహం : నిందితుల తక్షణ అరెస్టుకు డిమాండ్
ప్రధానాంశాలు:
Nagarkurnool District : కుమ్మెర ఘటనపై బీసీ జేఏసీ ఆగ్రహం : నిందితుల తక్షణ అరెస్టుకు డిమాండ్
Nagarkurnool District : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన దారుణ ఘటనపై బీసీ జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రకుల అహంకారంతో బీసీ కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసికందు మృతి చెందడం విషాదకరమని పేర్కొంటూ, నిందితులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వ తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరింది. ఈ మేరకు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం బీసీ కమిషన్ కార్యాలయాన్ని సందర్శించింది. బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్తో పాటు సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాష్లను కలిసి ఘటన వివరాలు వెల్లడిస్తూ వినతిపత్రం సమర్పించారు.
లింగంగౌడ్ మాట్లాడుతూ.. ఐదు రోజుల క్రితం కుమ్మెర గ్రామంలోని మల్లన్న ఆలయంలో టికెట్ లేకుండా ప్రవేశించారనే కారణంతో చాకలి కులానికి చెందిన గణేష్, చంద్రకళ, మౌనికలపై గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి మరియు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడగా, రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ, బీసీ యువజన సంఘం కార్యాలయ అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.