CM Revanth Reddy : రైతుబంధు, రెండు లక్షల రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

Authored By aruna | The Telugu News | Updated on : 22 February 2024, 4:00 pm
  •  CM Revanth Reddy : రైతుబంధు, రెండు లక్షల రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి సొంత నియోజకవర్గం కొడంగల్ లో రేవంత్ రెడ్డి పర్యటించారు. కొడంగల్ నియోజకవర్గంలో 4369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోస్గిలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మార్చి 15న రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేసే బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జలదోపిడి కంటే కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువ దోపిడీ జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

రాయలసీమను రతనాలసీమ చేసేందుకు కేసీఆర్ కృష్ణా జలాల తరలింపునకు సహకరించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కరీంనగర్ నుంచి గెలవరని మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారన్నారు. కేసీఆర్ ను గెలిపిస్తే పాలమూరుకు ఏం చేయలేదన్నారు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసిఆర్ లోక్ సభ ఎన్నికలకు ఓటు అడగాలని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. 2014లో ప్రధాని మోదీ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లు అయిన ఆ ప్రాజెక్టు హోదా ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి నాలుగు రూపాయలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవాలన్నారు.

కొడంగల్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి 2945 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 6.8 కోట్ల వ్యయంతో కొడంగల్ లో ఆర్ అండ్ బి అతిథి గృహం, 344.5 కోట్ల వ్యయంతో కొడంగల్ సింగిల్ లేన్ నుంచి డబుల్ లైన్ రోడ్లు, పలు బ్రిడ్జిలు నిర్మించనున్నారు. 27.886 కోట్లతో వికారాబాద్ జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేసేందుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కొడంగల్ మండల కేంద్రంలోని బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజీ కోసం 25 కోట్లు, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ కాలేజీ, 25 పడకల హాస్పిటల్ కోసం 224.50 కోట్లు రేవంత్ రెడ్డి కేటాయించారు. 3.99 కోట్లతో దుద్యాద్ మండలంలోని హస్నాబాద్ లో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మించనున్నారు.

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి