Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

 Authored By suma | The Telugu News | Updated on :12 February 2026,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి సియాటెల్ నగరం 29 మిలియన్ డాలర్లు (సుమారు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. 2023 జనవరి 23న జరిగిన ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందిగా నిలిచింది. తాజాగా ఈ కేసులో ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో పరిహార ప్రక్రియకు మార్గం సుగమమైంది.

Jahnavi Kandula family awarded Rs 262 crore compensation in death case

Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula : ప్రమాదం ఎలా జరిగింది?

జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లి సియాటెల్‌లోని సౌత్ లేక్ యూనియన్ ప్రాంతంలో ఉన్న నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. 2023 జనవరి 23న ఆమె రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాల గరిష్ఠ వేగ పరిమితి 40 కిలోమీటర్లు మాత్రమే. అయితే ఘటన సమయంలో పోలీసు అధికారి సుమారు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపినట్లు విచారణలో వెల్లడైంది. ఢీకొట్టిన ప్రభావంతో జాహ్నవి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరి పడినట్లు సమాచారం. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆగ్రహానికి దారి తీసింది.

Jahnavi Kandula : వివాదాస్పద వ్యాఖ్యలు, అధికారిపై చర్యలు

ఈ ఘటన అనంతరం సంబంధిత పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారి తీశాయి. జాహ్నవి మృతిపై ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. “ఆమె చనిపోయింది చాలా సాధారణ వ్యక్తి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది” అంటూ నవ్వుతూ మాట్లాడిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై భారత్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అమెరికాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆ అధికారిపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకొని చివరికి విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనతో అమెరికా పోలీస్ వ్యవస్థపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

Jahnavi Kandula : భారీ పరిహారానికి సియాటెల్ ఒప్పందం

ఈ కేసులో పరిహారం విషయంలో జాహ్నవి కుటుంబం న్యాయపోరాటం కొనసాగించింది. ఇరుపక్షాలు గత వారం కోర్టులో సంయుక్తంగా దరఖాస్తు దాఖలు చేయగా సియాటెల్ నగరం 29 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లకు సమానం. ఈ విషయంపై సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేస్తూ “జాహ్నవి కందుల మృతి అత్యంత విషాదకరం. ఈ పరిహారం ఆమె కుటుంబానికి కొంతమేర న్యాయం, ఉపశమనం అందిస్తుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందంపై జాహ్నవి కుటుంబం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. జాహ్నవి మృతి భారతీయ విద్యార్థుల భద్రత, విదేశాల్లో పోలీసు బాధ్యతలపై కొత్త చర్చలకు తెరలేపింది. ఈ భారీ పరిహారం నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలకు దారితీయాలని కుటుంబ సభ్యులు, భారతీయ సమాజం ఆశిస్తున్నారు.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది